Fact Check: యూపీలో హిందూ మహిళ ఆరుగురి ముస్లిం వ్యక్తుల తలలు నరికిందా? వైరల్ వార్తలో నిజమెంత?

Up

Up

Fact Check: యూపీలోని వారణాసిలో అత్యాచారం, మతమార్పిడి బెదిరింపులకు పాల్పడిన ఆరుగురు ముస్లిం యువకుల తలలను ఓ దళిత హిందూ మహిళ నరికివేసిందంటూ సోషల్ మీడియాలో వార్తలు, వీడియోలు, రీల్స్ చెక్కలు కొడుతున్నాయి. చాలా మంది ఈ వార్త నిజమే అని నమ్మేస్తున్నాయి. అయితే.. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదు. ఇది కల్పితం మాత్రమే. ఇండియా టుడేకు చెందిన ‘యూపీ తక్’ మీడియా సంస్థకు చెందిన లోగోను వాడుకుని తప్పుడు ప్రచారానికి తెరలేపారు. వారణాసిలోని బాబత్‌పూర్ హేమంత్‌పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగిందని, ఆ మహిళ ఆరుగురి తలలను స్థానిక కాళీ మాత గుడిలో సమర్పించి పరారైందని, దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆ పోస్టులో పేర్కొన్నారు. అయితే ఈ వార్తను వారణాసి పోలీస్ కమిషనరేట్ (డీసీపీ గోమతి జోన్) అధికారికంగా ఖండించింది. బాబత్‌పూర్ పరిధిలోని ఫుల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిమితుల్లో ఇలాంటి ఘటనేదీ అసలు జరగలేదని, కాళీ ఆలయం వద్ద తలలు లభ్యమయ్యాయనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. సమాజంలో మతపరమైన ఉద్రిక్తతలు పెంచేలా ఇలాంటి ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఇక, వైరల్ అవుతున్న ఆ స్క్రీన్‌షాట్‌లో అనేక లోపాలు, అబద్ధాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ వార్తా కథనంలో వాడిన ఆలయం ఫొటో వారణాసిలోనిది కాదు. అది వారణాసికి దాదాపు 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలహాబాద్‌లోని ‘సలోరి ఆలయం’ ఫొటో. అలాగే అందులోని పోలీసుల ఫొటో కూడా గతంలో ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక వివిధ సందర్భాల్లో వాడిన పాత ఫైల్ ఫొటో మాత్రమే. అంతేకాదు, ఆ స్క్రీన్‌షాట్ కింద భాగంలో కనిపించే ఒక అడ్వర్టైజ్‌మెంట్ గ్రాఫిక్, 2022 నాటి మధ్యప్రదేశ్ బడ్జెట్‌కు సంబంధించినది. దాన్ని ‘వెబ్‌దునియా’ అనే హిందీ వెబ్‌సైట్ నుంచి తీసుకుని అక్కడ ఉంచారు. వీటన్నింటికీ తోడు, ఆ తప్పుడు వార్తా కథనంలో హిందీ వ్యాకరణ దోషాలు, స్పెల్లింగ్ తప్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తమ లోగోను దుర్వినియోగం చేస్తూ కొందరు సృష్టించిన ఈ ఫేక్ న్యూస్ స్క్రీన్‌షాట్‌పై ఇండియా టుడేకు చెందిన ‘యూపీ తక్’ ఛానల్ సైతం స్పందించింది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఈ వార్త పూర్తిగా కల్పితమని, తాము ఇలాంటి ఎలాంటి వార్తను ప్రసారం చేయలేదని లేక ప్రచురించలేదని స్పష్టం చేస్తూ ప్రజలు ఇలాంటి పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. కాబట్టి, వారణాసిలో ఆరుగురి తలలు నరికేశారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇది కేవలం సమాజాన్ని తప్పుదోవ పట్టించడానికి, అశాంతిని సృష్టించడానికి కొందరు ఆకతాయిలు సృష్టించిన ఫేక్ రిపోర్ట్ మాత్రమే.