Site icon NTV Telugu

Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..

Ap New Dwcra Schemes 2026

Ap New Dwcra Schemes 2026

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళల చిరకాల నిరీక్షణకు తెరపడింది. ‘అభయహస్తం’ పథకం కింద తాము దాచుకున్న డబ్బులు తిరిగి వస్తాయో రావో అని ఆందోళన చెందుతున్న లక్షలాది మంది మహిళలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ నిధులను వెనక్కి ఇచ్చేందుకు ఆర్థిక శాఖ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఏమిటీ అభయహస్తం వివాదం..?

2009లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం ‘అభయహస్తం’ అనే సామాజిక భద్రతా పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. మహిళలు రోజుకు ఒక రూపాయి చొప్పున ఏడాదికి రూ.365 ప్రీమియం చెల్లిస్తే, ప్రభుత్వం తన వాటాగా మరో రూ.365 జమ చేస్తుంది. ఇలా 60 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.500 పెన్షన్ ఇవ్వడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మంది మహిళలు గత 12 ఏళ్లుగా ఈ పథకంలో సభ్యులుగా ఉండి, సుమారు రూ.1,194 కోట్లు పొదుపు చేశారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ వాటా రూ.1,000 కోట్లు కలిపితే ఈ నిధి మొత్తం రూ.2,194 కోట్లకు చేరుకుంది. అయితే.. గత ప్రభుత్వం ఈ నిధులను ఇతర అవసరాలకు మళ్లించడంతో మహిళలు ఆందోళనకు గురయ్యారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీ మేరకు.. డ్వాక్రా మహిళల సొమ్మును వడ్డీతో సహా తిరిగి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మళ్లించిన నిధులను తిరిగి సమీకరించి, మహిళల వ్యక్తిగత ఖాతాల్లోకి జమ చేసే ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నిర్ణయంతో 22 లక్షల మంది మహిళలకు ఆర్థికంగా వెసలుబాటు కలుగుతుంది.

ప్రస్తుతం ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఇతర పథకాలతో పోలిస్తే అభయహస్తం పెన్షన్ తక్కువగా ఉండటంతో, చాలామంది మహిళలు తమ అసలు సొమ్మును వెనక్కి తీసుకోవడానికే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిధులను సెటిల్ చేయడం ద్వారా మహిళా సాధికారతకు పెద్దపీట వేసినట్లయింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇది పెద్ద ఊరట.

Exit mobile version