AP Weather: ఏపీలో విచిత్ర వాతావరణం.. ఓ వైపు పిడుగులు.. మరోవైపు భానుడి భగభగలు..

Ap Newss

Ap Newss

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఒకవైపు పిడుగులతో కూడిన వర్షాలు, మరోవైపు తీవ్రమైన ఎండలు, వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది.

వాతావరణ సూచనల ప్రకారం రేపు పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడవచ్చు. ఈ నేపథ్యంలో ఆకస్మికంగా ఉరుములు, మెరుపులతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ క్రింద నిలబడరాదని APSDMA సూచించింది. పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరింది. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ, వీలైనంత దూరంగా ఉండాలని హెచ్చరించింది.

×
×
Ad

మరోవైపు రాష్ట్రంలో ఎండల తీవ్రత కూడా భారీగా ఉండనుంది. రేపు శ్రీకాకుళం జిల్లాలో 11 మండలాలు, విజయనగరం 20, మన్యం 14, అల్లూరి 1, పోలవరం 2, కాకినాడ 8 మొత్తంగా 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 51 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీల నుండి 44 డిగ్రీల మధ్య, అలాగే అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

ఇక ఈరోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లా గూడూరులో 44.6 డిగ్రీలు, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 43.7 డిగ్రీలు, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 43.3 డిగ్రీలు, కృష్ణా జిల్లా కానుమోలు, మన్యం జిల్లా సాలూరులో 43.1 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కరేడులో 43 డిగ్రీలు, విజయనగరం జిల్లా రాజాంలో 42.7 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా రాజాంలో 42.6 డిగ్రీలు, బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం, ఏలూరు జిల్లా నారాయణపురం, తిరుపతి జిల్లా పూలతోటలో 42.3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.