Amzath Basha: వైఎస్ జగన్ అంటే మీకు అంత భయం.. మాజీ డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు!

  • భద్రత ఇవ్వకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోంది
  • జగన్ పర్యటనకు జన సమీకరణ అవసరం లేదు
  • ఇలానే ఆంక్షలు పెట్టింటే మీరు రాష్ట్రంలో తిరిగే వారా?
  • వైఎస్ జగన్ అంటే మీకు అంత భయమా?
Amzath Basha

Amzath Basha

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనల్లో భద్రతా వైఫల్యం బయటపడుతోందని మాజీ డిప్యూటీ సీఎం, పీఏసీ సభ్యుడు అంజాద్‌ బాషా మండిపడ్డారు. జగన్ పర్యటనలో భద్రత ఇవ్వకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పర్యటనకు జన సమీకరణ అవసరం లేదని, స్వచ్ఛందంగా వేలాది మంది తరలివస్తారన్నారు. గత వైసీపీ పాలనలో ఇలానే ఆంక్షలు పెట్టింటే మీరు రాష్ట్రంలో తిరిగే వారా? అని అడిగారు. వైఎస్ జగన్ అంటే మీకు అంత భయమా? అని ప్రశ్నించారు. కడపలో పీఏసీ సమావేశంలో అంజాద్‌ బాషా మాట్లాడారు.

‘పీఏసీ సమావేశంలో అనేక అంశాలను చర్చించడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాలపై చర్చించాము. ప్రజా సమస్యల పరిష్కారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు వైఎస్ఆర్సీపీ బలోపేతానికి కృషి చేయాలని వైఎస్ జగన్ సూచించారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాలి. ప్రజలలోకి క్షేత్ర స్థాయిలో విస్తృతంగా తీసుకువెళ్లాని జగన్ చెప్పారు. త్వరలో కార్యకర్తలపై వేధింపులపై పోరాటానికి పార్టీ తరపున యాప్ వస్తోంది. కార్యకర్తలను వేధించి అక్రమ కేసులు పెట్టిన వారి భరతం పడతాం’ అని అంజాద్‌ బాషా హెచ్చరించారు.

‘వైఎస్ జగన్ పర్యటనల్లో భద్రతా వైఫల్యం బయటపడుతోంది.. జగన్ పర్యటనలో భద్రత ఇవ్వకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోంది. నెల్లూరు పర్యటనలో ప్రజలను రాకుండా అనేక ఆంక్షలు విధిస్తున్నారు. నెల్లూరును పోలీసులతో అష్టదిగ్బంధం చేశారు. దుష్ట సంప్రదాయానికి ప్రభుత్వం తెర లేపింది. జగన్ పర్యటనకు జన సమీకరణ అవసరం లేదు.. స్వచ్ఛందంగా వేలాది మంది తరలివస్తారు. గత వైసీపీ పాలనలో ఇలానే ఆంక్షలు పెట్టింటే మీరు రాష్ట్రంలో తిరిగే వారా?. జగన్ అంటే మీకు అంత భయం’ అని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.