Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!

  • రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్
  • 142 స్థానాల్లో ఓటింగ్
  • ఈసారి ఎవరిది పైచేయి!
  • దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి
Moditmc

Moditmc

ఒకరేమో మరోసారి అధికారం నిలబెట్టుకోవాలని.. ఇంకొకరేమో ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని.. ఇలా రెండు ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటిదాకా ఒకెత్తు అయితే రేపు మరోకెత్తు. అధికారం దక్కాలంటే రేపటి ఎన్నికలమే ప్రధానం. మరీ రేపు ఎవరు పైచేయి సాధించబోతున్నారు. మమతానా? మోడీనా? దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రేపు పశ్చిమ బెంగాల్‌లో చివరి విడత పోలింగ్ జరగనుంది. దక్షిణ బెంగాల్‌లోనే 142 స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. దక్షిణ బెంగాల్ అనేది తృణమూల్ కాంగ్రెస్‌కు కంచుకోట లాంటిది. అలాంటి చోట రేపు రసవత్తర పోరు జరగనుంది. ఇప్పటికే తొలి విడతలో భారీ పోలింగ్ జరిగింది. 152 స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో దాదాపు 93.19 శాతం ఓటింగ్ నమోదైంది. స్వాతంత్ర్యం వచ్చాక బెంగాల్‌లో ఈ స్థాయిలో ఓటింగ్ నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఆ రికార్డ్‌ను రేపు దక్షిణ బెంగాల్ బ్రేక్ చేయగలదా? లేదా? అన్నది ఆసక్తి నెలకొంది.

ఇక ‘‘సర్’’ కారణంగా పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఇలాంటి తరుణంలో రేపు కీలక చోట్ల ఓటింగ్ జరుగుతోంది. ముఖ్యంగా కోల్‌కతా, హౌరా, నాడియా, నార్త్ 24 పరగణాస్, సౌత్ 24 పరగణాస్ ప్రాంతాలు టీఎంసీకి గట్టి పట్టున్న ప్రాంతాలుగా భావిస్తారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. 2021లో ఈ ప్రాంతాల్లో టీఎంసీ 96 సీట్లు గెలుచుకోగా.. బీజేపీ కేవలం 14 సీట్లు మాత్రమే సాధించింది. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం కొంత పెరిగినా.. టీఎంసీనే ఆధిపత్యం కొనసాగించింది. మరోసారి ఈ ప్రాంతాలపైనే టీఎంసీ నమ్మకం పెట్టుకుంది. మరోవైపు ప్రధాని మోడీ, అమిత్ షా కూడా చాలా ఉధృతంగా ప్రచారం చేశారు. దక్షిణ బెంగాల్‌పైనే దృష్టి పెట్టి ప్రచారం చేశారు.

నార్త్ 24 పరగణాస్ (33 సీట్లు), సౌత్ 24 పరగణాస్ (31 సీట్లు), కోల్‌కతా (11), హౌరా (16). ఈ నాలుగు ప్రాంతాల్లో మొత్తం 91 సీట్లు ఉన్నాయి. ఇవే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ ప్రాంతాలను ‘‘బెంగాల్ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్’’గా పేర్కొంటారు. పశ్చిమ బెంగాల్‌లో అధికారాన్ని నిర్ణయించే ప్రధాన ప్రాంతాలుగా ఇవి గుర్తింపు పొందాయి. ఇలాంటి చోట గెలవడం అత్యంత ప్రముఖ్యత కలిగి ఉంది.

ఇంతకీ ఈ దక్షిణ బెంగాల్ ప్రజలు ఎటువైపు ఉన్నారన్నది రేపే తేలిపోనుంది. ఇక తొలి విడతలో జరిగిన పోలింగ్ అంతా తమకే అనుకూలంగా ఉందని బీజేపీ చెబుతోంది. రేపటి ఓటర్లు ఎటువైపు ఉన్నారన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇక దక్షిణ బెంగాల్‌లో విజయం సాధించకపోతే మాత్రం అధికారంలోకి రావడం కష్టం అనే అభిప్రాయం ఇప్పటికీ ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ.. తృణమూల్ కంచుకోట బద్ధలు కొట్టగలదా? లేక టీఎంసీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటుందా? సర్వత్రా ఆసక్తిగా మారింది.

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తొలి విడతలో 152 స్థానాల్లో పోలింగ్ జరగగా.. రేపు 142 స్థానాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఎన్నికల ఫలితాలు మాత్రం మే 4న విడుదల కానున్నాయి.