దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి… రికవరీ రేటు పెరుగుతోందని ఆనందం వ్యక్తం చేసింది కేంద్రం… ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్… పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోందన్నారు. మే 3వ తేదీన రికవరీ రేటు 81.7 శాతం ఉందన్న ఆయన.. ఇప్పుడు అది 85.6 శాతానికి చేరిందన్నారు. ఇక, గత 24 గంటల్లో కోవిడ్నుం చి 4,22,436 మంది కోలుకున్నట్టు వెల్లడించారు లవ్ అగర్వాల్.. దేశంలో ఇంత భారీ స్థాయిలో రికవరీ రేటు నమోదు కావడం ఇదే మొదటిసారి అన్నారు.. దీంతో.. కరోనా రికవరీ కేసుల్లో పాజిటివ్ ట్రెండ్ మొదలైందని.. కొత్త కేసుల కంటే.. రికవరీ కేసులే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.
ఇక, దేశంలో యాక్టివ్ కేసులు ఎలా ఉన్నాయన్నదానిపై వివరణ ఇచ్చిన ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి శుక్లా.. ప్రస్తుతం 8 రాష్ట్రాల్లో లక్షకుపైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, 10 రాష్ట్రాల్లో 50 వేల నుంచి లక్ష మధ్య.. 18 రాష్ట్రాల్లో 50 వేల లోపు యాక్టివ్ కేసులు ఉన్నట్టు వెల్లడించారు. 199 జిల్లాల్లో కొత్త కేసుల తరుగుదల కనిపిస్తోందని.. గత 3 వారాల నుంచి పాజిటివ్ రేటు తగ్గుతూ వస్తుందన్నారు. మరోవైపు.. దేశంలో ఇప్పటివరకు కోవిడ్ వ్యాధి 1.8 శాతం మందికి వచ్చిందని, వైరస్ వ్యాప్తిని రెండు శాతం లోపు నియంత్రించినట్లు తెలిపారు.