Thalapathy Vijay: తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, మేజిక్ ఫిగర్ (118)కు కొద్ది దూరంలో ఆగిపోయిన తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ అవలంభిస్తున్న వైఖరి ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.
గవర్నర్ పట్టుబట్టడం వెనుక మర్మమేంటి..
టీవీకే అధినేత, నటుడు విజయ్ ఇప్పటికే రెండుసార్లు గవర్నర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే ముందుగా 118 మంది ఎమ్మెల్యేల మద్దతు సంతకాలను (సపోర్ట్ లెటర్స్) సమర్పించాలని గవర్నర్ కఠిన నిబంధన విధించారు. దీంతో శాసనసభలో బలపరీక్షకు అనుమతించకుండా, ముందే సంతకాలు అడగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై లోకనాయకుడు కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. “మెజారిటీ అనేది లోక్భవన్లోని మూసి ఉన్న గదుల్లో కాదు, శాసనసభ సాక్షిగా తేలాలి” అంటూ సోషల్ మీడియా వేదికగా చారిత్రాత్మక ఎస్.ఆర్. బొమ్మై తీర్పును గుర్తు చేశారు.
‘ఎస్.ఆర్. బొమ్మై’ తీర్పు ఏమిటి?
1980వ దశకంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న ఎస్.ఆర్.బొమ్మై ప్రభుత్వాన్ని అప్పటి గవర్నర్ ఏకపక్షంగా రద్దు చేశారు. తనకున్న మెజారిటీని అసెంబ్లీలో నిరూపించుకుంటానని బొమ్మై కోరినప్పటికీ, అవకాశం ఇవ్వకుండానే ఆర్టికల్ 356ను ప్రయోగించి రాష్ట్రపతి పాలన విధించారు. ఈ ఘటన దేశ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి రావడంతో 1994లో సుప్రీంకోర్టు 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం దీనిపై సంచలన తీర్పునిచ్చింది. ఒక ప్రభుత్వానికి మెజారిటీ ఉందో లేదో కేవలం శాసనసభలోనే తేల్చాలి. గవర్నర్ తన వ్యక్తిగత అభిప్రాయంతో నిర్ణయం తీసుకోకూడదు. రాష్ట్రపతి పాలన విధించడం లేదా ప్రభుత్వాన్ని రద్దు చేయడం వంటి నిర్ణయాలు కోర్టు పరిధిలోకి వస్తాయి. ఒకవేళ నిర్ణయం ఏకపక్షంగా ఉంటే కోర్టు దానిని కొట్టివేస్తుంది అని సంచలన తీర్పును వెలువరించింది. నాటి నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లోని ప్రతిపక్ష ప్రభుత్వాలను ఇష్టారాజ్యంగా కూలదోయకుండా ఈ తీర్పు ఒక ‘రక్షణ కవచం’లా మారింది.
తమిళనాడు వివాదంలో కీలక ప్రశ్నలు..
ప్రస్తుతం తమిళనాడులో నెలకున్న రాజకీయ సంక్షోభంపై రాజ్యాంగ నిపుణులు రెండు రకాలుగా వాదిస్తున్నారు.. సర్కారియా, పుంచి కమిషన్ల సిఫార్సుల ప్రకారం.. స్పష్టమైన మెజారిటీ లేనప్పుడు, సభలో అతిపెద్ద పార్టీని (TVK) ముందుగా అధికారం ఏర్పాటుకు ఆహ్వానించాలి. వారు సభలో మెజారిటీ నిరూపించుకోలేకపోతేనే ఇతర ప్రత్యామ్నాయాలను చూడాలి. మరికొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పడిపోకుండా ఉండేందుకు, గవర్నర్ ముందుగానే మద్దతు లేఖలు అడిగే అధికారం కలిగి ఉంటారని చెబుతున్నారు. 32 ఏళ్ల నాటి బొమ్మై తీర్పు ఇప్పుడు విజయ్ రాజకీయ భవిష్యత్తుకు మార్గదర్శిగా మారిందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గవర్నర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి టీవీకేకు ఫ్లోర్ టెస్ట్ అవకాశం కల్పిస్తారా? లేక రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం మరింత ముదురుతుందా? అన్నది వేచి చూడాలి.
