Caste Census: రాబోయే జనగణనలో కులగణన నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్) సుప్రీంకోర్టు కొట్టివేసింది. కులగణన నిర్వహించాలా వద్దా అనేది ప్రభుత్వ విధాన నిర్ణయమని స్పష్టం చేసిన అత్యున్నత న్యాయస్థానం, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం వారి జనాభా వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ కేసును విచారించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. “ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు కావాలంటే వెనుకబడిన వర్గాల్లో ఎంతమంది ఉన్నారో ప్రభుత్వానికి తెలుసుకోవాల్సిందే” అని సీజేఐ సూర్య కాంత్ వ్యాఖ్యానించారు.
జనగణనలో కుల ఆధారిత లెక్కలు తీసుకోవడం వల్ల కొన్ని సంస్థలు లేదా వర్గాలు దానిని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని పేర్కొంటూ పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. కులగణనను తొలగించాలని కోరుతూ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే ఈ వాదనలను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. కులగణన చేపట్టాలా వద్దా అనేది పూర్తిగా ప్రభుత్వ విధానానికి సంబంధించిన అంశమని, ఇందులో కోర్టు జోక్యం అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా కులగణన అంశంపై రాజకీయంగా కూడా తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు, సామాజిక న్యాయం వంటి అంశాల్లో కులగణన కీలకమని పలువురు రాజకీయ నాయకులు, సామాజిక సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలతో రాబోయే జనగణనలో కులగణన నిర్వహణకు మార్గం సుగమమైనట్టేనని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.
