Shinzo Abe: షింజో అబేకు భారత్ నివాళి.. రేపు “జాతీయ సంతాప దినం”గా ప్రకటన

Modi Shinzo Abe

Modi Shinzo Abe

జపాన్ మాజీ ప్రధాని షింజో అబేని హత్య చేయడం ప్రపంచాన్ని కలవరానికి గురిచేసింది. జపాన్ నారా పట్టణంలో మాట్లాడుతున్న సమయంలో ఓ దుండగుడు రెండు రౌండ్ల పాటు షింజో అబేపైకి కాల్పులు జరిపారు. దీంతో షింజో అబే మరణించారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మరణంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షింజో అబేకు నివాళిగా భారత్ రేపు(జూలై 9) ఒక రోజు పాటు జాతీయ సంతాప దినం పాటించాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

షింజో అబేతో తనకు ఉన్న స్నేహం గురించి ప్రధాని మోదీ ట్వీట్స్ చేశారు. ఇటీవల టోక్యో వెళ్లిన సమయంలో తన స్నేహితుడు షింజో అబేను కలుసుకున్న ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. జపాన్- ఇండియా సంబంధాల బలోపేతానికి అబే కృషి చేశారని.. జపాన్- ఇండియా అసోసియేషన్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక బంధం బలపడేందుకు సహకారం అందించారని ప్రధాని మోదీ గుర్తు చేస్తున్నారు. భారతదేశం ఈ కష్ట సమయంలో జపాన్ సోదర సోదరీమణులకు సంఘీభావంగా నిలుస్తుందని ఆయన ట్వీట్ చేశారు. షింజో అబే కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచే తనకు షింజో అబేతో అనుబంధం ఉందని గుర్తు చేస్తున్నారు. ప్రధాని అయిన తర్వాత మా స్నేహం కొనసాగిందని..ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ వ్యవహారాలపై ఆయన అవగాహన చాలా లోలైనదని అన్నారు.

Read Also: Chiyan Vikram: బ్రేకింగ్.. హీరో విక్రమ్ కు గుండెపోటు

మరోవైపు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారత్, జపాన్ మధ్య దైపాక్షిక బంధాన్ని బలోపేతం చేయడానికి కృషి చేశారని.. భారత్ సన్నిహిత మిత్రుడిని కోల్పోయిందని ఆయన అన్నారు. 2019లో జపాన్ పర్యటనలో ఉన్న సందర్భంగా అబేను కలిశానని.. సురక్షితమైన, మెరుగైన ప్రపంచాన్ని నెలకొల్పాలనే దృక్పథాన్ని కలిగి ఉన్న స్ఫూర్తిదాయక నాయకుడని రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.