Nationwide Medical Shop Strike: దేశవ్యాప్తంగా నేడు మందుల దుకాణాలు (కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ షాపులు) 24 గంటల సమ్మెకు పిలుపునిచ్చాయి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసన కారణంగా దేశవ్యాప్తంగా దాదాపు 15 లక్షలకు పైగా మందుల షాపులు మూతపడనున్నాయి. ఇ-ఫార్మసీల (ఆన్లైన్ మందుల అమ్మకాలు) ద్వారా జరుగుతున్న విక్రయాలు, వారు ఇస్తున్న భారీ తగ్గింపులకు నిరసనగా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో రోగులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రాణరక్షక మందుల సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సంఘం సభ్యులు వెల్లడించారు. అనియంత్రిత ఆన్లైన్ అమ్మకాల వల్ల సాంప్రదాయ రిటైల్ వ్యాపారుల పొట్ట గడవడమే కాకుండా, నకిలీ మందుల ముప్పు పెరిగి రోగుల భద్రత గాల్లో దీపంగా మారుతోందని AIOCD ఆందోళన వ్యక్తం చేసింది.
కెమిస్టుల 3 ప్రధాన డిమాండ్లు ఇవే..
AIOCD జాతీయ అధ్యక్షుడు జె.ఎస్.షిండే, ప్రధాన కార్యదర్శి రాజీవ్ సింఘాల్ లు మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వ విధానాలు రిటైల్ వ్యాపారులను రోడ్డున పడేస్తున్నాయని అన్నారు. తమ ప్రధాన డిమాండ్లు ఇవే అని చెప్పారు.
జీఎస్ఆర్ 817 (GSR 817) నోటిఫికేషన్ రద్దు చేయాలన్నారు. ఆన్లైన్ మందుల అమ్మకాలకు అనుమతినిచ్చే ఈ నోటిఫికేషన్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. కోవిడ్ నిబంధనల (GSR 220) ను కూడా రద్దు చేయాలన్నారు. కరోనా మహమ్మారి సమయంలో అమల్లోకి తెచ్చిన నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. భారీ డిస్కౌంట్లకు చెక్ పెట్టాలన్నారు. ఆన్లైన్ కంపెనీలు ఇష్టారాజ్యంగా ఇచ్చే భారీ తగ్గింపులను అరికట్టాలని, లేదా సాధారణ రిటైలర్లు కూడా పోటీలో నిలబడేలా ఔషధ ధరల నియంత్రణ ఉత్తర్వు (DPCO)ను సవరించి మార్జిన్ పెంచాలని కోరారు.
సమ్మెపై భిన్నస్వరాలు..
అయితే ఈ సమ్మెకు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి పూర్తి మద్దతు లభించడం లేదు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పలు రాష్ట్రాల ఫార్మసీ సంఘాలు ఈ బంద్కు దూరంగా ఉంటున్నట్లు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ప్రకటించింది. దీంతో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్, ఛత్తీస్గఢ్, సిక్కిం, ఉత్తరాఖండ్, లడఖ్ రాష్ట్రాల్లో మందుల దుకాణాలు తెరిచే ఉంటాయని, మందులకు ఏవిధమైన కొరత ఉండదని, షాపులు యథావిధిగా తెరిచి ఉంటాయని అక్కడి సంఘాలు లిఖితపూర్వక హామీ ఇచ్చాయి. కర్ణాటకలో 20 వేల మందికి పైగా కెమిస్టులు, మధ్యప్రదేశ్లో 52 జిల్లా సంఘాలు సమ్మెకు సై అనడంతో అక్కడ బంద్ ప్రభావం తీవ్రంగా ఉండనుందని చెబుతున్నారు. చండీగఢ్లో కూడా సమ్మెకు మద్దతు లభించింది.
అప్రమత్తమైన యంత్రాంగం.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇదే..
సమ్మె నేపథ్యంలో రోగులకు ఇబ్బందులు కలగకుండా రాష్ట్రాల ఆరోగ్య శాఖలు, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) రంగంలోకి దిగాయి. తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) ప్రజల కోసం ప్రత్యేక అడ్వైజరీ జారీ చేసింది. అత్యవసర సేవల కోసం టోల్-ఫ్రీ నంబర్లు, స్థానిక డ్రగ్ ఇన్స్పెక్టర్ల నంబర్లను అందుబాటులో ఉంచింది. అలాగే అపోలో (Apollo), మెడ్ప్లస్ (MedPlus) వంటి పెద్ద కార్పొరేట్ చైన్ మెడికల్ స్టోర్లను కచ్చితంగా తెరిచి ఉంచాలని ఆదేశించింది. చండీగఢ్లో రోగుల కోసం కొన్ని ప్రధాన స్టోర్లను 24 గంటలూ తెరిచి ఉంచేలా అధికారులు చర్యలు చేపట్టారు. రిటైల్ వ్యాపారుల సమస్యలను పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ఇదే తరుణంలో మందుల కొరత సృష్టించినా లేదా బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడినా సహించేది లేదని CDSCO అధికారులు స్పష్టంగా హెచ్చరికలు జారీ చేశారు.
