మధ్యప్రదేశ్లో అదృశ్యమైన న్యాయవాది అర్చన తివారీ నేపాల్ సరిహద్దులో ప్రత్యక్షమైంది. ఆగస్టు 7న ఇండోర్ నుంచి కాట్నీకి వెళ్తుండగా అదృశ్యమైంది. దీంతో పేరెంట్స్ భయాందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీరియస్గా తీసుకున్న కేసును.. మూడు బృందాలు వేటాడాయి. అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఎట్టకేలకు ఆమె ఆచూకీని ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి జిల్లాలోని నేపాల్ సరిహద్దులో కనిపెట్టారు.
అర్చన తివారీ(28).. సివిల్ జడ్జి పదవికి సిద్ధపడుతోంది. అయితే ఇండోర్లో హాస్టల్లో ఉంటున్న ఆమె.. రక్షా బంధన్ కోసం ఆగస్టు 7న స్వస్థలం కట్నీకి రైల్లో బయల్దేరింది. ఆ రాత్రి 10:16 గంటలకు తల్లితో చివరి సారిగా ఫోన్లో మాట్లాడింది. అనంతరం ఆమె సిగ్నల్స్ కట్ అయ్యాయి. ఇక రైలు ఉదయం 6:50 గంటలకు కాట్నీ సౌత్ సెంట్రల్ రైల్వేస్టేషన్కు చేరుకుంది. కానీ ఆమె దిగలేదు. దీంతో తల్లిదండ్రులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టగా ఎట్టకేలకు రెండు వారాల తర్వాత నేపాల్ సరిహద్దులో కనిపించింది. ఆమె సజీవంగా కనిపించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ఆమె సివిల్ జడ్జి పదవికి సిద్ధపడుతుండగా తల్లిదండ్రులు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. కట్నిలోని స్థానిక పట్వారీతో ఆమెకు వివాహం చేయాలని పేరెంట్స్ సిద్ధపడ్డారు. చదువును విడిచిపెట్టి వివాహం చేసుకోవాలని కుటుంబ సభ్యులు భారీగా ఒత్తిడి తెస్తున్నారు. దీన్నుంచి తప్పించుకునేందుకు తన స్నేహితులతో కలిసి కుట్ర పన్నింది.
స్నేహితుడు సరన్ష్, ఆటో డ్రైవర్ టిజేందర్ సాయంతో ఉద్దేశపూర్వకంగానే తప్పించుకుందని పోలీసులు తెలిపారు. అనుమానం రాకుండా ఉండేందుకు ట్రైన్లోనే వేరొక డ్రస్ మార్చుకుందని చెప్పారు. పదే పదే తల్లిదండ్రులు పెళ్లి ప్రస్తావన రావడంతో ఈ కుట్ర పన్నినట్లుగా పేర్కొన్నారు. అధికారులను తప్పుదోవ పట్టించేందుకే బ్యాగ్ను రైల్లో సీటు దగ్గర వదిలేసిందని చెప్పారు. తాను నదిలో పడి చనిపోయినట్లుగా నమ్మించేందుకే ఇలా చేసిందన్నారు. అయితే ఈ కేసును ఎలాంటి హడావుడి చేయకుండా ముగించాలని అర్చన తివారీ కోరిందని చెప్పారు.
