Karnataka: కర్ణాటకలోని మద్యం ప్రియులకు సిద్ధరామయ్య ప్రభుత్వం ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలను భారీగా తగ్గిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అబ్కారీ (ఎక్సైజ్) విధానంలో విప్లవాత్మక మార్పులు చేస్తూ.. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ‘అల్కహాల్-ఇన్-బెవరేజ్’ (AIB) ఆధారిత ఎక్సైజ్ డ్యూటీ మోడల్ను అమల్లోకి తీసుకువచ్చింది. మద్య నియంత్రణ పన్నులను హేతుబద్ధీకరించి, సామాన్య వినియోగదారులకు అందుబాటు ధరల్లో నాణ్యమైన మద్యాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సీఎం సిద్ధరామయ్య తన 2026 – 27 బడ్జెట్లో ప్రకటించిన ఈ పన్ను సంస్కరణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అమలు కానున్నాయి.
దేశంలోనే తొలిసారిగా ‘AIB’ ప్యాటర్న్..
కర్ణాటక ఎక్సైజ్ శాఖ ఆదివారం వెల్లడించిన అధికారిక సమాచారం ప్రకారం.. మే 11, 2026 నుంచి రాష్ట్రంలో ఈ కొత్త ‘ఏఐబీ’ (AIB) పన్ను విధానం అమలులోకి వచ్చింది. భారతీయ అబ్కారీ చరిత్రలోనే ఇలాంటి ప్రయోగం జరగడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్ ప్రమాణాల ప్రకారం, మద్యంపై పన్ను విధించడానికి ఈ ఏఐబీ సిస్టమ్ను అత్యుత్తమ విధానంగా (గోల్డ్ స్టాండర్డ్) భావిస్తారు. ఈ పద్ధతిలో.. మద్యంలో ఉండే ఆల్కహాల్ శాతం (పరిమాణం) ఆధారంగా పన్నును లెక్కిస్తారు. దీనివల్ల పన్ను వసూళ్లలో పారదర్శకత పెరగడమే కాకుండా, మద్యం పరిశ్రమకు ఒక స్పష్టమైన రోడ్మ్యాప్ లభిస్తుంది.
ఈ కొత్త ఎక్సైజ్ విధానం వల్ల సామాన్య వినియోగదారులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. కర్ణాటకలో మద్యం ధరలను పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ రేట్లతో సమానంగా తీసుకురావడమే ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం. దీర్ఘకాలంగా సరిహద్దు రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలో మద్యం ధరలు చాలా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఈ కొత్త పన్ను విధానం వల్ల ప్రముఖ బ్రాండ్ల మద్యం ధరలు పొరుగు రాష్ట్రాల కంటే సమానంగా లేదా అంతకంటే తక్కువగా లభించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కంపెనీలకే ధరల నిర్ణయాధికారం..
ఈ కొత్త పాలసీ ద్వారా మద్యం పరిశ్రమకు కూడా ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. ఇప్పటి వరకు మద్యం రీటైల్ ధరలను పూర్తిగా ప్రభుత్వమే నిర్ణయించేది. కానీ తాజా విధానంలో ఆ ప్రక్రియను ‘డీరెగ్యులేట్’ (నియంత్రణ ముక్తం) చేశారు. ఇకపై మద్యం తయారు చేసే కంపెనీలు మార్కెట్ డిమాండ్, పోటీని బట్టి స్లాబ్ పరిమితులకు లోబడి తమ ఉత్పత్తుల ధరలను స్వయంగా నిర్ణయించుకోవచ్చు. మే 8, 2026న జారీ చేసిన ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం.. ఇండియన్ మేడ్ లిక్కర్ (IML) కోసం గతంలో ఉన్న 16 పన్ను స్లాబ్లను సగం చేసి, కేవలం 8 స్లాబ్లుగా కుదించారు. బాటిల్ సైజ్, అందులోని ఆల్కహాల్ శాతం ఆధారంగా కొత్త రేట్లను ఖరారు చేశారు. ఇందులో ప్రముఖ బీర్ బ్రాండ్ల నుంచి ఐఎమ్ఎల్ వరకు అన్ని రకాల మద్యం రేట్లు ఉన్నాయి. పన్ను స్లాబ్లు తగ్గడం వల్ల కంపెనీల మధ్య పోటీ పెరిగి, వినియోగదారులకు తక్కువ ధరకే ప్రీమియం బ్రాండ్లు దొరికే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
