Ravi Naik: గోవా మాజీ ముఖ్యమంత్రి రవి నాయక్ కన్నుమూత.. మోడీ సంతాపం

  • మాజీ ముఖ్యమంత్రి రవి నాయక్ కన్నుమూత
  • ప్రధాని మోడీ సంతాపం
Ravi Naik

Ravi Naik

గోవా వ్యవసాయ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి రవి నాయక్(79) కన్నుమూశారు. బుధవారం గుండెపోటుతో మరణించినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. పనాజీకి 30 కి.మీ దూరంలో ఉన్న స్వస్థలంలో నాయక్ గుండెపోటుకు గురయ్యారు. వెంటనే పోండా పట్టణంలో ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున 1 ఒంటి గంటకు మరణించినట్లు వైద్యులు తెలిపారు. రవి నాయక్ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. ఇక రవి నాయక్ భౌతికకాయాన్ని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సందర్శించి నివాళులర్పించారు. ప్రజా సంక్షేమానికి ఆయన చేసిన సేవ ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Tamil Nadu: ఎన్నికల్లో ‘ఉచిత భార్య’ వాగ్దానం కూడా ఇవ్వొచ్చు.. దుమారం రేపుతున్న ఎంపీ వ్యాఖ్యలు

×
×
Ad

రవి నాయక్‌కు భార్య, ఇద్దరు పిల్లలు, ఒక కోడలు, ముగ్గురు మనవరాళ్లు ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం అంత్యక్రియులు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక రవి నాయక్‌‌ను కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు.

నాయక్ మృతికి మోడీ సంతాపం తెలిపారు. ‘‘గోవా అభివృద్ధి పథాన్ని సుసంపన్నం చేసిన అనుభవజ్ఞుడైన నిర్వాహకుడిగా, అంకితభావంతో కూడిన ప్రజా సేవకుడిగా గుర్తుండిపోతారు. అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడం పట్ల మక్కువ చూపారు. ఈ దుఃఖ సమయంలో నా ఆలోచనలు ఆయన కుటుంబం, మద్దతుదారులతో ఉన్నాయి. ఓం శాంతి.’’ అని మోడీ పేర్కొన్నారు.

రవి నాయక్…
రవి నాయక్.. కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభ్యర్థిగా ఏడుసార్లు (పోండా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు, మార్కైమ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒకసారి) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1984లో MGP టిక్కెట్‌పై పోండా నియోజకవర్గం నుంచి మొదటిసారి రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 1989 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి మార్కైమ్ అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపొందారు. 1999, 2002, 2007, 2017 సంవత్సరాల్లో కాంగ్రెస్ టిక్కెట్‌పై, 2022లో బీజేపీ టిక్కెట్‌పై పోండా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా ఎన్నికయ్యారు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. మొదటిసారి జనవరి 1991 నుంచి మే 1993 వరకు.. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. అనంతరం 1994లో గోవాకు అతి తక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. ఆ సంవత్సరం ఏప్రిల్ 2 నుంచి 8 వరకు ఆరు రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక 1998లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తర గోవా నుంచి పార్లమెంటు సభ్యుడు కూడా పోటీ చేశారు.

ఇది కూడా చదవండి: Prashant Kishor: బిహార్‌ ఎన్నికలు.. ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం!