ప్రధాని మోడీ పంజాబ్‌ టూర్‌లో భద్రతా వైఫల్యం.. 150 మందిపై కేసులు..

భారత ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్‌ పర్యటనలో భద్రతా వైఫల్యం తీవ్ర దుమారాన్నే రేపుతోంది.. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.. అయితే, ఈ ఘటనలో ఫిరోజ్‌పుర్​పోలీసులు 150 మందిపై కేసులు నమోదు చేశారు. రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగించినందుకు జిల్లాలోని కుల్​గరి పోలీస్​స్టేషన్‌లో ఎఫ్ఐఆర్‌లు నమోదు అయ్యాయి.. ఇక, ఆ 150 మందిపై గరిష్టంగా రూ.200 జరిమానా విధించే సెక్షన్‌తో పంజాబ్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.. ఎఫ్‌ఐఆర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పేరు మాత్రం ప్రస్తావించలేదు. ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పంజాబ్ ప్రభుత్వం.. కేంద్రానికి నివేదిక పంపించింది.

Read Also: డొనాల్డ్ ట్రంప్ మాస్టర్‌ ప్లాన్..

కాగా, ప్రధాని మోడీ గత బుధవారం రోజు పంజాబ్‌ పర్యటనకు వెళ్లగా.. ఫిరోజ్‌పుర్‌ జిల్లాలో నిరసనకారులు రాస్తారోకో చేపట్టారు.. రోడ్లను దిగ్బంధించి ఆందోళనకు దిగారు.. దీంతో.. ప్రధాని మోడీ, ఆయన కాన్వాయ్‌ 15-20 నిమిషాల పాటు వంతెనపై చిక్కుకుపోయింది.. ఇక, తన తన పర్యటనను అర్ధంతరంగా రద్దుచేసుకున్న ప్రధాని మోడీ.. ఢిల్లీకి తిరిగి వెళ్లిపోయారు.. అయితే, సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే మోడీ సభకు హాజరు కాలేకపోయారని కేంద్ర హోంశాఖ ప్రకటించడంతో.. పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే.