NTV Telugu Site icon

IC 814 Hijack: నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘IC 814’పై వివాదం..హైజాకర్లకు హిందూ పేర్లు.. అసలు నిజం ఇదే..

Ic 814 The Kandahar Hijack Story

Ic 814 The Kandahar Hijack Story

IC 814 Hijack: చిత్ర నిర్మాత అనుభవ్ సిన్హా తాజా వెబ్ సిరీస్ ‘IC 814: ది కాందహార్ హైజాక్ స్టోరీ’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 1999లో ఖాట్మాండు నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఉగ్రవాదుల హైజాక్ చేసిన ఉదంతం ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ని నిర్మించారు. అయితే, ఈ వెబ్‌సిరీస్ వివాదాస్పదంగా మారింది. హైజాకర్లలో ఇద్దరికి హిందూ పేర్లు ఉండటంపై ఓ వర్గం సోషల్ మీడియాలో విమర్శలు చేస్తోంది. ‘‘బాయ్‌కాట్ బాలీవుడ్’’ పేరుతో ఎక్స్‌లో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

నేపాల్‌లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానాన్ని లాహోర్, దుబాయ్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్ కాందహార్‌కి తీసుకెళ్లిన ఘటన ఆధారంగా రూపొందించిన వెబ్‌సిరీస్‌లో హైజాకర్ల పేర్లను చీఫ్, డాక్టర్, బర్గర్, భోలా, శంకర్ అని పిలవడం చూడొచ్చు. హైజాకర్ల కోసం చిత్ర నిర్మాత ఉద్దేశపూర్వకంగా వారి అసలు పేర్లను కాకుండా హిందూ పేర్లను ఎంచుకున్నారని సోషల్ మీడియాలో చాలా మంది భోలా, శంకర్ పేర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అనుభవ్ సిన్హా వాస్తవాలను తప్పుగా సూచించారని, మతపరమైన మనోభావాలను దెబ్బతిస్తున్నారని విమర్శించారు.

Read Also: Sologami: ఏడాది క్రితం తనను తాను పెళ్లి చేసుకున్న ఓ మహిళ.. ఇప్పుడు విడాకులు

నిజం ఏంటంటే..?

జనవరి 6, 2000న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన ప్రకారం హైజాకర్ల అసలు పేర్లు వెల్లడించింది. ఇబ్రహీం అథర్(బహవల్పూర్), షాహిద్ అక్తర్ సయ్యద్(కరాచీ), సన్నీ అహ్మద్ ఖాజీ(కరాచీ), మిస్త్రీ జహూర్ ఇబ్రహీం( కరాచీ), షకీర్ (సుక్కూర్ సిటీ)కి చెందిన వారిగా గుర్తించింది. అయితే, హైజాక్ చేయబడిన విమానంలోని ప్రయాణీకుల ముందు హైజాకర్లు వారి కోడ్ నేమ్స్‌లో పిలుస్తారు. భోలా, శంకర్ అనే పేర్లను చిత్ర నిర్మాతలు కానీ దర్శకులు కానీ కావాలని ఉపయోగించలేదు. ఈ ఘటన సమయంలో ఇద్దరు హైజాకర్లకు ఈ కోడ్ నేమ్స్ ఉపయోగించారు.

IC 814: కాందహార్ హైజాక్:

హైజాకర్లు న్యూఢిల్లీకి రావాల్సిన విమానాన్ని డిసెంబర్ 24, 1999లో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హర్కత్-ఉల్-ముజాహిదీన్‌కు చెందిన ఐదుగురు సాయుధ ఉగ్రవాదులు హైజాక్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ కాందహార్ తీసుకెళ్లారు. భారత జైళ్లలో ఉన్న 36 మంది ఉగ్రవాదులను, 200 మిలియన్ డాలర్ల నగదుతో పాటు మరణించిన ఉగ్రవాది అవశేషాలను కూడా విడుదల చేయాలని హైజాకర్లు డిమాండ్ చేశారు. హైజాకర్లు, భారత ప్రభుత్వం మరియు తాలిబాన్ ప్రతినిధుల మధ్య తీవ్రమైన చర్చలు జరిగాయి. చివరకు జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్, అహ్మద్ సయీద్ షేక్, ముస్తాక్ అహ్మద్ జర్గర్‌ని భారత్ విడిచిపెట్టింది.