Darshan Case: కన్నడ స్టార్ హీరో దర్శన్ హత్య కేసులో ఇరుక్కోవడం సంచలనంగా మారింది. తన అభిమాని రేణుకాస్వామిని దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపిన కేసులో దర్శన్తో పాటు ఆయనతో సహజీవనం చేస్తున్న నటి పవిత్ర గౌడతో సహా 15 మంది అరెస్టులు జరిగాయి. పెళ్లై అప్పటికే భార్య, పిల్లలు ఉన్న దర్శన్, పవిత్ర గౌడతో సహజీవనం చేయడంపై రేణుకాస్వామి అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఈ హత్యకు కారణమైనట్లు తెలుస్తోంది. చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి బెంగళూర్ తీసుకువచ్చి దారుణంగా కొట్టి చంపారు. పోస్టుమార్టం నివేదికలో అతని శరీరంపై తీవ్రగాయాలు ఉండటంతో పాటు వృషణాలపై తీవ్రగాయాల వల్లే మరణించినట్లు తేలింది.
Read Also: Team India-PM Modi: ప్రధాని మోడీతో భారత క్రికెటర్లు.. ఫొటోస్ వైరల్!
ఇదిలా ఉంటే, తాజాగా దర్శన్ భార్య విజయలక్ష్మీ బెంగళూర్ పోలీస్ కమిషనర్ బి. దయానందకు లేఖ రాశారు. ఇందులో పవిత్ర గౌడ దర్శన్ భార్య కాదని పేర్కొన్నారు. వీరిద్దరు కేవలం స్నేహితులు మాత్రమే అని స్పష్టం చేశారు. ‘‘మీరు విలేకరుల సమావేశంలో పవిత్ర గౌడ దర్శన్ భార్య అని తప్పుడు ప్రకటన చేసారు, ఈ తప్పును కర్ణాటక హోం మంత్రి మరియు జాతీయ మీడియా పునరావృతం చేసింది, రేణుకాస్వామి కేసులో దర్శన్ దంపతులను అరెస్టు చేసినట్లు నివేదించాయి’’ అని లేఖలో ఆమె పేర్కొన్నారు.
పోలీసు రికార్డుల్లో పవిత్ర గౌడను దర్శన్ భార్యగా పేర్కొనవద్దని, భవిష్యత్తులో తనకు, తన కుమారుడు వినీష్కు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున భార్యగా చెప్పొద్దని విజయలక్ష్మీ పోలీస్ కమిషనర్ని అభ్యర్థించారు. పవిత్ర గౌడకు సంజయ్ సింగ్తో వివాహమైందని, అతనికి ఒక కుమార్తె ఉందని, ఈ వాస్తవాలను పోలీసు రికార్డుల్లో కచ్చితంగా నమోదు చేయాలని ఆమె ఉద్ఘాటించారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, చట్టం తన పని చేస్తుందని నమ్ముతున్నానని అన్నారు. పవిత్ర గౌడ నా భర్త స్నేహితులు మాత్రమే అని, ఆమె అతని భార్య కాదని, దర్శన్ ఏకైక చట్టబద్ధ భార్యను తానే అని, తమ వివాహం మే 19, 2003న ధర్మస్థల (హిందూ పుణ్యక్షేత్రం)లో జరిగిందని విజయలక్ష్మీ చెప్పారు.