Site icon NTV Telugu

సోషల్ మీడియా ఖాతాల హ్యాక్‌పై కేంద్రం సీరియస్‌…

ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాల హ్యాక్‌పై కేంద్రం సీరియస్‌గా ఉందా ? సామాజిక మాధ్యమాల హ్యాకింగ్‌పై…యాంటీ సైబర్‌ క్రైమ్‌ బృందంతో…దర్యాప్తు చేయించనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీ పిల్లల ఖాతాలను…సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు.

తన పిల్లల ఇన్‌స్టాగ్రాం ఖాతాలను హ్యాక్ చేశారంటూ కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ చేసిన ఆరోపణలను కేంద్రం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజాలను నిగ్గు తేల్చేందుకు అడ్వాన్స్‌డ్ యాంటీ సైబర్ క్రైమ్ యూనిట్‌తో దర్యాప్తు చేయించనున్నట్లు సమాచారం. హ్యాకింగ్‌ గురించి ప్రియాంక అధికారికంగా ఫిర్యాదు చేయనప్పటికీ, కేంద్రమే సొంతంగా దర్యాప్తు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐటీ శాఖ పరిధిలో పనిచేసే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్.. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయనుంది. ఈ టీమ్ అడ్వాన్స్‌డ్ ల్యాబ్‌ను నడుపుతోంది. అది హ్యాకర్లను గుర్తించడమే కాకుండా, సైబర్ దాడులను నివారిస్తుంది.

కొద్ది రోజుల క్రితం ప్రధాని మోడీ ఖాతాను తమ ఆధీనంలోకి తీసుకోగా…తాజాగా కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ పిల్లలు ఖాతాలను హ్యాక్‌ చేశారు. కుమార్తె మిరాయా వాద్రా , కుమారుడు రైహాన్ వాద్రా…ఇన్‌స్టా గ్రాం ఖాతాలు… ఫోన్లు హ్యాక్ అయినట్టు ప్రియాంక గాంధీ స్వయంగా వెల్లడించారు. ప్రభుత్వం తన పిల్లల ఇన్‌స్టాగ్రాం ఖాతాలను హ్యాక్ చేస్తోందని… వాళ్లకు వేరే పనిలేదా? అని ప్రశ్నించారు ప్రియాంకా గాంధీ.

ఇటీవల ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ తన ఫోన్‌ ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. తమ ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయని… సంభాషణలు రికార్డు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. తమ పార్టీ ఆఫీస్‌ ఫోన్ల సంభాషణలు వింటున్నారన్న అఖిలేశ్‌… సాయంత్రం పూట సీఎం కూడా తమ పార్టీ నేతల సంభాషణలు వింటున్నారని ఆరోపించారు.

Exit mobile version