Captain GR Gopinath: భారత విమానయాన రంగానికి జె.ఆర్.డి.టాటా ఆద్యుడిగా నిలిచినా.. కేవలం కోటీశ్వరులకే పరిమితమైన విమాన ప్రయాణాన్ని ‘సామాన్యుడి’ ముంగిట తెచ్చిన అసలు సిసలైన కథ కెప్టెన్ జి.ఆర్.గోపీనాథ్తోనే మొదలవుతుంది. ‘ఎయిర్ డెక్కన్’ సంస్థను స్థాపించి, భారతదేశంలో అతి తక్కువ ధరకే విమాన ప్రయాణ కలను సాకారం చేసిన ఆయన జీవితం ఎందరికో ఆదర్శం. నిజానికి కెప్టెన్ గోపీనాథ్ కేవలం ఒక విమానయాన పారిశ్రామికవేత్త మాత్రమే కాదు, ఆయన ఒక సైనిక అధికారి, సేంద్రీయ రైతు, పట్టు పరిశ్రమ నిపుణుడు, రాజకీయ నాయకుడు కూడా. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ దేశీయ విమానయాన రంగాన్నే మార్చేసే దార్శనికతను ఆయన ఎలా సాధించారు, ఒక సామాన్యుడి విమాన కలను ఆయన ఎలా నిజం చేశారు, దాని కోసం ఆయన ఎలాంటి వ్యూహాలను అనుసరించారు, ఆయన స్థాపించిన సంస్థ ఇప్పుడు ఏమైంది అనేది ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
పల్లెటూరి నుంచి ప్రస్థానం.. ‘మిలిటరీ హోటల్’ తెచ్చిన ఆలోచన
కర్ణాటకలోని హాసన్ జిల్లా ‘గోరూర్’ అనే ఒక చిన్న గ్రామంలో గోపీనాథ్ జన్మించారు. ఆయన తండ్రి ఒక పాఠశాల ఉపాధ్యాయుడు. గ్రామీణ వాతావరణంలో, ప్రకృతి ఒడిలో పెరిగిన గోపీనాథ్కు చిన్నతనంలోనే మహాత్మా గాంధీ ఆత్మకథ, సోక్రటీస్ బోధనలు పరిచయమయ్యాయి. ఆయన సైనిక పాఠశాల పరీక్ష రాయడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఆ రోజుల్లో గ్రామంలోని నాన్ వెజ్ ధాబాలను ‘మిలిటరీ హోటల్స్’ అని పిలిచేవారు. అక్కడ తినే సైనికులు ఎంతో దృఢంగా ఉండటం చూసి, తండ్రి ప్రోత్సాహంతో గోపీనాథ్ సైన్యంలో చేరాలని నిశ్చయించుకున్నారు. మొదటిసారి ఇంగ్లీష్లో పరీక్ష రాసి ఫెయిల్ అయ్యాడు, అయితే రెండోసారి కన్నడలో పరీక్ష రాసి సైనిక పాఠశాలలో ప్రవేశం సాధించారు.
బంగ్లాదేశ్ యుద్ధం నుంచి సేంద్రీయ వ్యవసాయం వైపు..
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) లో శిక్షణ పూర్తి చేసుకున్న గోపీనాథ్, 1971లో భారత సైన్యంలో అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో కూడా ఆయన చురుగ్గా పాల్గొన్నారు. కొన్ని సంవత్సరాల సేవల అనంతరం, నెలకు కేవలం 1,350 రూపాయల జీతం ఉన్న సమయంలో ఆయన ఆర్మీ నుంచి పదవీ విరమణ చేశారు. అప్పుడు ఆయనకు వచ్చిన గ్రాట్యుటీ కేవలం 6,350 రూపాయలు మాత్రమే. ఆ తర్వాత ఒక బీడు భూమిని కొనుగోలు చేసి, పాత గుడారంలో నివసిస్తూ పట్టు పరిశ్రమ, సేంద్రీయ వ్యవసాయాన్ని స్టార్ట్ చేశారు. పురుగుమందులు లేని ఆయన వ్యవసాయ నమూనాకు అంతర్జాతీయ గుర్తింపు లభించడమే కాకుండా, ప్రతిష్టాత్మక ‘రోలెక్స్ అవార్డు’ కూడా వరించింది. అనంతరం రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్షిప్ ద్వారా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఎనిమిది బ్రాంచ్లను సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేశారు.
ఒకే ఒక్క విమాన ప్రయాణం.. మార్చిన ఆలోచనా విధానం!
1990వ దశకంలో తన పాత ఆర్మీ ఫ్రెండ్తో కలిసి ‘డెక్కన్ ఏవియేషన్’ అనే హెలికాప్టర్ సర్వీస్ను స్టార్ట్ చేశారు. అయితే 2002లో అమెరికాలోని ఫీనిక్స్ విమానాశ్రయంలో సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆయన ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. ఆయన పక్క సీట్లో కూర్చున్న ఒక సాధారణ వడ్రంగి.. తక్కువ ఛార్జీల వల్లే తాను కుటుంబంతో కలిసి విమానంలో ప్రయాణించగలుగుతున్నానని చెప్పాడు. ఆ మాట గోపీనాథ్ మనసును కదిలించింది. “భారతదేశంలోని వడ్రంగులు, నర్సులు, మెకానిక్లు ఎందుకు విమానం ఎక్కకూడదు?” అనే ప్రశ్న ఆయనలో ‘ఎయిర్ డెక్కన్’ స్థాపనకు బీజం వేసింది.
‘ఒక్క రూపాయి’ టికెట్ సంచలనం..
ఆగస్టు 25, 2003న ‘ఎయిర్ డెక్కన్’ విమాన సర్వీసులు స్టార్ట్ అయ్యాయి. ఉచిత భోజనాలు, విలాసాలు లేకుండా.. కేవలం సురక్షితమైన ప్రయాణమే లక్ష్యంగా ఇది సాగింది. ముఖ్యంగా ‘ఒక్క రూపాయికే విమాన టికెట్’ అంటూ వారు ప్రవేశపెట్టిన ఆఫర్ దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల విమాన కల నిజమైంది. కేవలం కొద్ది సంవత్సరాల్లోనే దేశీయ మార్కెట్లో ఎయిర్ డెక్కన్ 22 శాతం వాటాను కైవసం చేసుకుంది. దీని సక్సెస్ నమూనాను చూసే ఆ తర్వాత ఇండిగో, స్పైస్జెట్, గోఎయిర్ వంటి ఎన్నో బడ్జెట్ ఎయిర్లైన్స్ మార్కెట్లోకి వచ్చాయి.
కింగ్ ఫిషర్ విలీనం..
వ్యాపారం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో సంస్థపై ఆర్థిక ఒత్తిడి పెరిగింది. 2007లో విజయ్ మాల్యాకు చెందిన ‘యూబీ గ్రూప్’ ఎయిర్ డెక్కన్ వాటాలను కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఎయిర్ డెక్కన్ లోని తక్కువ ధరల విధానాన్ని మార్చి, దానికి ‘కింగ్ఫిషర్ రెడ్’గా పేరు మార్చారు. ఆ పరిణామాలతో గోపీనాథ్ కంపెనీ నుంచి తప్పుకున్నారు. దీనిని ఇప్పటికీ తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పుగా ఆయన అభివర్ణించారు. ఆ తర్వాత ఆయన కార్గో ఎయిర్లైన్ను స్టార్ట్ చేసి, కేంద్ర ప్రభుత్వ ‘ఉడాన్’ (UDAN) పథకం కింద ఎయిర్ డెక్కన్ను పునఃప్రారంభించినప్పటికీ, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఆయన పుస్తకాలు రాస్తూ, నూతన పారిశ్రామికవేత్తలకు గైడెన్స్ ఇస్తున్నారు. “నిజమైన గొప్పతనం ఎప్పుడూ కింద పడిపోకుండా ఉండటంలో లేదు, కింద పడిన ప్రతిసారీ రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ పైకి లేవడంలోనే ఉంది” అనే సిద్ధాంతాన్ని నమ్మే కెప్టెన్ గోపీనాథ్ ప్రస్థానం.. భారత పారిశ్రామిక చరిత్రలో ఎప్పటికీ ఒక సువర్ణాధ్యాయంగా మిగిలిపోతుందని విశ్లేషకులు అభివర్ణించారు.
