Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్

  • కేజ్రీవాల్ కుటుంబానికి SIR నోటీసులు
  • ‘ఇదెలా సాధ్యం?’ అంటూ ఈసీపై ఆప్ ఫైర్
  • డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైన 20 రోజుల తర్వాత నోటీసులు
Kejriwal2

Kejriwal2

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా నోటీసులు జారీ అయ్యాయి. ఓటర్ల జాబితాలో వివరాలకు సంబంధించిన అసమానతల నేపథ్యంలో ఢిల్లీలో మొత్తం 33.1 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

కేజ్రీవాల్‌తో పాటు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్, కుమారుడు పుల్కిత్ కేజ్రీవాల్, తల్లిదండ్రులు గోవింద్ రామ్ కేజ్రీవాల్, గీతా దేవికి కూడా నోటీసులు అందాయి. కేజ్రీవాల్ న్యూఢిల్లీ-40 అసెంబ్లీ నియోజకవర్గంలో నమోదైన ఓటరుగా ఉన్నారు.

ఈసీపై ఆప్ తీవ్ర విమర్శలు

కేజ్రీవాల్ కుటుంబ సభ్యులకు నోటీసులు రావడంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల సంఘంపై విమర్శలు గుప్పించింది. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేసిన ఆప్.. ‘‘ఈ దేశంలో జరుగుతున్న ప్రతిదీ సుప్రీం లార్డ్‌ను సంతోషపెట్టేందుకేనా? మూడు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్, ఆయన కుటుంబ సభ్యుల పేర్లు ఢిల్లీ ఓటర్ల జాబితాలో లేకపోవడం ఎలా సాధ్యం?’’ అని ప్రశ్నించింది.

‘నో మ్యాపింగ్’, ‘లాజికల్ డిస్క్రెపెన్సీస్’ కేటగిరీలు

డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ఆగస్టు 31న ప్రచురించిన దాదాపు మూడు వారాల తర్వాత ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం SIRలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో గత SIRతో వివరాలను అనుసంధానం చేయలేని ఓటర్లను “No Mapping”, వివరాల్లో తార్కిక అసమానతలు ఉన్నవారిని “Logical Discrepancies” కేటగిరీల్లో చేర్చారు. ఈ నేపథ్యంలోనే గత SIRతో కేజ్రీవాల్, ఆయన కుటుంబ సభ్యుల వివరాలను మ్యాప్ చేయడం సాధ్యం కాకపోవడంతో వారికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

కపిల్ సిబల్‌కూ నోటీసులు

రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ కూడా గత SIRతో వివరాలు మ్యాప్ కాకపోవడంతో నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. మాజీ ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా, ఆయన భార్య, సోదరుడికి కూడా పేర్లలో అసమానతల కారణంగా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

33 లక్షలకుపైగా ఓటర్లకు నోటీసులు

ఎన్నికల అధికారులు గతంలో వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 13,79,785 మంది ఓటర్ల వివరాలను గత SIRతో మ్యాప్ చేయలేకపోయారు. మరో 19,33,134 మంది ఓటర్ల వివరాల్లో “లాజికల్ డిస్క్రెపెన్సీస్” ఉన్నట్లు గుర్తించారు. వీరి పేర్లు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో ఉన్నప్పటికీ.. వివరణ కోసం విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు.