Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు

  • నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం
  • కేంద్రం ఉత్తర్వులు
Niti Aayog

Niti Aayog

కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ (NITI Aayog) కొత్త ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఈవో)గా మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అనురాగ్ జైన్‌ను నియమించింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గ నియామకాల కమిటీ ఆమోదం తెలిపినట్లు సిబ్బంది, శిక్షణ శాఖ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

డీఓపీటీ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. అనురాగ్ జైన్ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచే ఆయన నియామకం అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఆయనకు మంజూరైన సేవా పొడిగింపు పూర్తయ్యే వరకు, అనంతరం మొత్తం రెండేళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు.. ఏది ముందుగా వస్తే అంత వరకు ఆయన నీతి ఆయోగ్ సీఈవోగా కొనసాగనున్నారు. అలాగే ఆయన నియామకం తనకు ముందు ఈ పదవిలో ఉన్న సీఈవోకు వర్తించిన అదే నిబంధనలు, షరతుల ప్రకారమే ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

పరిపాలనా సేవలో విస్తృతమైన అనుభవం ఉన్న అనురాగ్ జైన్‌ ప్రస్తుతం మధ్యప్రదేశ్ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. జైన్ పదవీ విరమణ ఆగస్టు 31, 2025న జరగాల్సి ఉంది. అయితే ఆయన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఒక సంవత్సరం పొడిగింపును మంజూరు చేసింది. ఈ పొడిగింపుతో ఆయన పదవీకాలం ఆగస్టు 31, 2026 వరకు కొనసాగుతుంది. నీతి ఆయోగ్ సీఈఓగా ఆయన నియామకాన్ని దేశ విధాన రూపకల్పన ప్రక్రియలో ఒక ముఖ్యమైన పరిపాలనా మార్పుగా పరిగణిస్తున్నారు.