Site icon NTV Telugu

Cabinet Decisions: 12 కొత్త స్మార్ట్ సిటీలు,10 లక్షల మందికి ఉద్యోగాలు.. కేబినెట్ నిర్ణయం..

Cabinet Decisions

Cabinet Decisions

Cabinet Decisions: దేశవ్యాప్తంగా కొత్తగా 12 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వీటి ద్వారా 10 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. కేబినెట్ సమావేశం తర్వాత మాట్లాడిన ఆయన.. ‘‘నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలకు క్యాబినెట్ ఈ రోజు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ. 28,602 కోట్లు పెట్టుబడి పెడుతుంది.’’ అని చెప్పారు.

దేశంలోని 10 రాష్ట్రాల్లో ఈ 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలని నిర్మించే బృహత్తర కార్యక్రమానికి కేంద్ర కేబినెట్ పచ్చ జెండా ఊపింది. తయారీ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఈ స్మార్ట్ సిటీల ద్వారా ప్రత్యక్షంగా 10 లక్షల మందికి, పరోక్షంగా 30 లక్షల మందికి ఉద్యోగాలను సృష్టిస్తుంది. 1.52 లక్షల కోట్ల పెట్టుబడి సామర్థ్యం ఉంది. ప్రపంచస్థాయి గ్రీన్ ఫీల్డ్ పారిశ్రామిక స్మార్ట్ సిటీలను ‘ప్లగ్-ఎన్-ప్లే’ మరియు ‘వాక్-టు-వర్క్’ కాన్సెప్ట్‌లతో నిర్మించనున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

Read Also: Kolkata rape-murder Case: డాక్టర్ హత్యాచార నిందితుడి కేసుని వాదిస్తోంది ఓ మహిళ.. ఆమె ఎవరంటే..?

అమృత్‌సర్-కోల్‌కతా, ఢిల్లీ-ముంబై, వైజాగ్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-నాగ్‌పూర్, చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లతో సహా ఆరు పారిశ్రామిక కారిడార్లలో ఈ ప్రాజెక్టులను అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రకటించారు. ఈ పారిశ్రామిక ప్రాంతాలు ఉత్తరాఖండ్‌లోని ఖుర్పియా, పంజాబ్‌లోని రాజ్‌పురా-పాటియాలా, మహారాష్ట్రలోని డిఘి, కేరళలోని పాలక్కాడ్, యూపీలోని ఆగ్రా మరియు ప్రయాగ్‌రాజ్, బీహార్‌లోని గయా, తెలంగాణలోని జహీరాబాద్, ఏపీలోని ఓర్వకల్ మరియు కొప్పర్తి, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్-పాలిలో ఉంటాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

దీంతో పాటు 6,456 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 296 కిలోమీటర్ల పొడవున్న మూడు ప్రధాన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదించింది. ఈ ప్రాజెక్టులు రైలు కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుచనున్నాయి. ప్రాంతీయ అభివృద్ధికి, ప్రత్యేకించి ఒడిశాలోని నువాపాడా మరియు జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్ వంటి జిల్లాలల్లో అభివృద్ధికి దోహదపడుతాయి. 2020లో రూ.1 లక్ష కోట్ల బడ్జెట్‌తో ప్రారంభించిన అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌ను విస్తరించనున్నట్లు క్యాబినెట్ ప్రకటించింది. దీని ద్వారా ప్యాక్ హౌస్‌లు, కోల్డ్ స్టోరేజీ, రిఫ్రిజిరేటెడ్ వాహనాలు మరియు ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు సదుపాయాలకు నిధులు అందనున్నాయి. ఈశాన్య రాష్ట్రాలలో 62 GW జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉన్న హైడ్రో-ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.4,136 కోట్ల ఈక్విటీ మద్దతును ప్రకటించింది.

Exit mobile version