Srinivasa Mangapuram: సినిమా విడుదలకు ముందు జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లు అంచనాలను పెంచడమే కాదు, నటీనటులు, దర్శకులు తమ అనుభవాలను పంచుకునే వేదికగా కూడా నిలుస్తాయి. ఈ రోజు ప్రసాద్ ల్యాబ్ లో ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా ప్రెస్మీట్లో నటులు బ్రహ్మాజీ, నరేష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. జయకృష్ణ నటన నుంచి కృష్ణ గారి సినీ వారసత్వం వరకు పలు అంశాలపై వారు మాట్లాడగా, సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
నటుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ తాను సూపర్స్టార్ కృష్ణకు వీరాభిమాని అని చెప్పారు. జయకృష్ణ ఎంతో సహజంగా నటిస్తాడని ప్రశంసించిన ఆయన, ఈ సినిమాలో మోహన్బాబు, నరేష్ తో తనకు కీలక సన్నివేశాలు ఉన్నాయని వెల్లడించారు. మోహన్బాబుతో నటించే సమయంలో ఎప్పుడూ భయం అనిపించలేదని, కానీ దర్శకుడు అజయ్ భూపతితో పనిచేసేటప్పుడు మాత్రం భయపడ్డానని సరదాగా వ్యాఖ్యానించారు. ఒకసారి ఆయన బాహుబలి లా కనిపిస్తే, మరోసారి స్వాతిముత్యం లా ఉంటారని చమత్కరించారు. షూటింగ్ సమయంలో ఒక రోజు మోహన్బాబు డిన్నర్కు తీసుకెళ్లి తనకు, నరేష్కు రెండు సింగిల్ మాల్ట్ బాటిళ్లను బహుమతిగా ఇచ్చిన సంఘటనను కూడా గుర్తు చేసుకున్నారు.
నరేష్ మాట్లాడుతూ జయకృష్ణను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని, ఇటీవల ఆయన ఇంటర్వ్యూలను కూడా ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నానని అన్నారు. జయకృష్ణను చాలామంది లెగసీ భారం గురించి ప్రశ్నిస్తున్నారని, కానీ లెగసీ అనేది ఎప్పుడూ భారం కాదని, అది ఒక బాధ్యత అని స్పష్టం చేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ చిత్ర పరిశ్రమకు రెండు కళ్లయితే, కృష్ణ గారు ఆ పరిశ్రమకు గుండెకాయలాంటి వారని అభివర్ణించారు.
తెలుగు సినిమా చరిత్ర గురించి కూడా నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పద్మాలయ బ్యానర్ చాలా కాలం క్రితమే తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిందని, ‘మోసగాళ్ళు కి మోసగాడు’ చిత్రం రష్యాలో ప్రివ్యూ ప్రదర్శన పొందడం అప్పట్లోనే గొప్ప విజయమని గుర్తు చేశారు. అలాగే ‘శివ’ తర్వాత ఇండస్ట్రీలో బెంచ్మార్క్గా నిలిచిన చిత్రం అజయ్ భూపతి తెరకెక్కించిన ‘RX100’ అని కొనియాడారు. నిర్మాత అశ్వినీ దత్ ఇప్పటికీ ‘కల్కి’లాంటి భారీ చిత్రాలు నిర్మిస్తుండటాన్ని ప్రశంసిస్తూ, ఆయనను నెవర్ రిటైర్ అండ్ ఎవర్ టైర్ ప్రొడ్యూసర్ గా అభివర్ణించారు.
ఈ సినిమాలో పాటలు, హీరో హీరోయిన్ల మధ్య ఉండే ఎమోషనల్ ట్రాక్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందని నరేష్ విజయకృష్ణ నమ్మకం వ్యక్తం చేశారు. బ్రహ్మాజీ వల్ల అజయ్ భూపతి దగ్గర తాను చాలాసార్లు తిట్లు తిన్నానని కూడా సరదాగా చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమాపై యువతలో మంచి బజ్ ఉందని, కృష్ణ, మహేష్ బాబు అభిమానులు కుటుంబాలతో కలిసి థియేటర్లకు వస్తారని, జూలై 30న ఈ సినిమా విజయాన్ని అందుకుంటుందనే పూర్తి విశ్వాసం మాకు ఉందని చెప్పుకొచ్చారు.

