PV Sindhu: రాజమౌళి సినిమాలో నటిస్తా.. పీవీ సింధు ట్వీట్ వైరల్, హీరోయిన్ ఛాన్స్ అడిగిన స్టార్ షట్లర్!

Pv Sindhu Ssrajamouli

Pv Sindhu Ssrajamouli

PV Sindhu: బ్యాడ్మింటన్ కోర్టులో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా భారత జెండాను రెపరెపలాడించిన పీవీ సింధు.. ఇప్పుడు సరదాగా చేసిన ఒక ట్వీట్‌తో సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి ప్రశంసలకు స్పందిస్తూ, ఆయన సినిమాలో నటించేందుకు సిద్ధమని, ఒకవేళ బ్యాడ్మింటన్ ప్లేయర్ పాత్ర ఉంటే తనను కొత్త హీరోయిన్‌గా తీసుకోవాలని చమత్కరించడంతో అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ట్వీట్ ఇప్పుడు సినీ, క్రీడా వర్గాల్లో వైరల్‌గా మారింది.

ఇటీవల జపాన్ ఓపెన్ టోర్నమెంట్‌లో అద్భుతమైన ప్రదర్శనతో టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన పీవీ సింధును అభినందిస్తూ ఎస్‌ఎస్ రాజమౌళి ప్రత్యేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయురాలిగా నిలిచిన సింధుకు శుభాకాంక్షలు, వాట్ ఏ ఛాంపియన్ కంబ్యాక్, భారతదేశం నిన్ను చూసి గర్విస్తోంది అంటూ ఆయన ప్రశంసలు కురిపించారు.

ఈ ట్వీట్‌కు పీవీ సింధు కూడా అదే స్థాయిలో సరదాగా స్పందించింది.. థ్యాంక్యూ సో మచ్ రాజమౌళి సార్, మీ ‘వారణాసి’ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా, ఒకవేళ మీ సినిమాలో ఎప్పుడైనా బ్యాడ్మింటన్ ప్లేయర్ పాత్ర అవసరమైతే, ఒకవేళ కొత్త హీరోయిన్‌గా నటించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా అంటూ నవ్వుతున్న ఎమోజీలతో ట్వీట్ చేసింది. సింధు చేసిన ఈ కామెంట్‌ను నెటిజన్లు భారీగా షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినీ హిస్టరీలోనే అత్యంత భారీ ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తోంది. ఇందులో మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సుమారు రూ.1,400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఆఫ్రికన్ అడవులు, అంటార్కిటికా, వారణాసి వంటి విభిన్న ప్రాంతాల నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.

రాజమౌళి సినిమాల్లో ప్రతి పాత్రకూ ప్రత్యేక ప్రాధాన్యం ఉండటం తెలిసిందే. అందుకే పీవీ సింధు చేసిన ఈ సరదా ఆఫర్‌పై అభిమానులు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. గతంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా రాజమౌళి సినిమాలో నటించాలని ఆసక్తి వ్యక్తం చేసిన విషయం గుర్తు చేస్తూ, ఇప్పుడు పీవీ సింధు కూడా అదే జాబితాలో చేరిందని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్.

ప్రస్తుతం ‘వారణాసి’ గురించి వస్తున్న ప్రతి చిన్న అప్‌డేట్ వైరల్ అవుతోంది. 2027 ఏప్రిల్ 7న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, అప్పటి వరకు రాజమౌళి నుంచి వచ్చే ప్రతి అప్ డేట్ హల్చల్ చేస్తోంది. ఇక పీవీ సింధు చేసిన ఈ సరదా ట్వీట్ నిజంగానే ఎప్పుడైనా తెరపైకి వస్తుందా, లేక అభిమానులను అలరించిన సోషల్ మీడియా మూమెంట్‌గానే మిగిలిపోతుందా అనేది చూడాలి.