Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!

Preityzinta

Preityzinta

Preity Zinta: బాలీవుడ్ నటి ప్రీతి జింటా దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత మరోసారి వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆమె, పెళ్లి తర్వాత సినిమాలకు దూరమై పూర్తిగా ఫ్యామిలీ జీవితానికే ప్రాధాన్యం ఇచ్చింది. ఇప్పుడు ‘బత్వారా 1947’ మూవీతో రీఎంట్రీ ఇస్తున్న ప్రీతి, తన కెరీర్ కంటే ఇప్పటికీ భర్త, పిల్లలే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానని చెప్పింది. 2016లో అమెరికాకు చెందిన జీన్ గూడెనఫ్‌ను వివాహం చేసుకున్న ప్రీతి, పెళ్లి అనంతరం అమెరికాలో స్థిరపడింది. ఆ తర్వాత 2021లో సరోగసీ ద్వారా కవల పిల్లలకు తల్లిగా మారింది. అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలితోనే ఎక్కువ సమయం గడిపింది. ఇప్పుడు ఆగస్టు 14న విడుదల కానున్న ‘బత్వారా 1947’ చిత్రంతో ఆమె మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

తన రీఎంట్రీ గురించి రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ, ఈ విరామంలో కుటుంబంతో గడిపిన సమయం తన జీవితంలో అత్యంత విలువైనదని, పిల్లలను పెంచడంలో వచ్చే ఆనందం ఏ విజయానికీ సాటిరాదని పేర్కొంది. ఎంత పెద్ద సినిమా వచ్చినా తన పిల్లలు, భర్తే జీవితంలో మొదటి ప్రాధాన్యమని స్పష్టం చేసింది. అయితే సినిమా విషయంలో ఒకింత మక్కువ చూపినా, ఓటీటీ ప్రాజెక్టుల విషయంలో మాత్రం ప్రీతి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వెబ్ సిరీస్‌లకు కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం కేటాయించాల్సి వస్తుందని, ప్రస్తుతం తన చిన్నారులతో గడిపే సమయాన్ని తగ్గించుకోవాలని తాను కోరుకోవడం లేదని వెల్లడించింది. తనను ప్రోత్సహించే కథలు వస్తే సినిమాలు చేస్తానని, కానీ కుటుంబానికి ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తీసుకోనని తెలిపింది.

ఈ సందర్భంగా తన భర్త జీన్ గూడెనఫ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. రెండు నెలల పాటు ఇండియాలో షూటింగ్‌ల కోసం ఉండాల్సి వచ్చినా ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా కుటుంబ బాధ్యతలను చూసుకుంటారని, అలాంటి భర్త దొరకడం తన అదృష్టమని పేర్కొంది. తన కవల పిల్లల పెంపకం గురించి కూడా ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వారు జన్మతః సగం భారతీయులు, సగం అమెరికన్లు అయినప్పటికీ, సంస్కృతి పరంగా మాత్రం పూర్తిగా భారతీయ విలువలతోనే పెంచుతున్నానని చెప్పింది. అదే సమయంలో భారతదేశం, అమెరికా రెండింటిలోని మంచి విలువలను వారు అలవర్చుకోవాలని కోరుకుంటున్నానని వెల్లడించింది. ఎన్నో సంవత్సరాల తర్వాత తిరిగి నటిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ, తన జీవితంలో స్టార్‌డమ్ కంటే కుటుంబ బంధాలకే ఎక్కువ విలువ ఇస్తానని ప్రీతి జింటా మరోసారి స్పష్టం చేసింది.