NTV Telugu Site icon

పూరీ ‘పేదరికం’ గురించి ఏమన్నారంటే..?

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ మధ్య సోషల్ మీడియాలో పూరీ మ్యూజింగ్స్‌ ద్వారా పలు ఆసక్తికరమైన అంశాలపై ముచ్చటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ‘పేదరికం’ గురించి పూరీ మ్యూజింగ్స్ వేదికగా ముచ్చటించారు. ధనవంతుడిగా జీవించే వ్యక్తి చివరికి ఏమీ నేర్చుకోలేడని.. కానీ పేదరికంలో ఉండే వ్యక్తి ఎన్నో జీవిత పాఠాలు తెలుసుకోగలుగుతాడని అన్నారు. మీ పిల్లల కోసం.. నా పిల్లల కోసం.. ఏ కష్టం తెలియకుండా పిల్లల్ని పెంచాలని మనం చూస్తాం.. అది చాలా తప్పు. వాళ్లకి కష్టం తెలియాలి. యుద్ధం తెలియాలి. యుద్ధం నేర్పకపోతే మీ కొడుకు అలెగ్జాండర్‌ కాలేడు. యుద్ధం చేయాలంటే వాడు కత్తి పట్టాలి. రక్తం చిందాలి.
పేదరికం ఎవరికీ నచ్చదు. అందులో ఉండాలని ఎవరూ కోరుకోరు. మనందరం డబ్బు కావాలని కోరుకుంటాం. దాని కోసం ఎంతో కష్టపడతాం. తప్పులేదు. కానీ ఒక ధనవంతుడిగా నువ్వు ఏదీ నేర్చుకోలేవు. ఒక పేదవాడిగా నువ్వు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మీకు ఎంత డబ్బు ఉన్నా సరే జీవితంలో ఒక్కసారైనా పేదవాడిగా జీవించండి. కనీసం ఒక్క నెలరోజులైనా వేరే ఊరుకి వెళ్లి మీ కాళ్లపై మీరు నిలబడండి. జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది. కష్టం, కన్నీళ్లుకు సరైన నిర్వచనం అర్థమవుతుంది. కష్టపడి సంపాదించిన డబ్బుని మీ అమ్మనాన్నలకు ఇవ్వండి. ఇన్నాళ్లు మీకోసం వాళ్లు ఎంత చేశారో అర్థమవుతుంది. జీవితాంతం ధనవంతుడిగా బతకడానికి ముందు ఒక్కసారి పేదరికం చూడండి. చనిపోయేలోపు ఒక్కసారైన పేదవాడిగా బతకండి. పేదరికం చూడకుండా అస్సలు చావొద్దు అని పూరీ వివరించారు.