Namo Namo Ji Shankara: శ్రావణ మాసం సమీపిస్తే దేశవ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. భక్తి గీతాలు ప్రతి ఇంటిలోనూ మారుమోగుతాయి. అలాంటి సమయంలో మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక శివభక్తి గీతం గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. సినిమా పాటగా విడుదలైనప్పటికీ, కాలక్రమంలో అది కోట్లాది మంది శివభక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. యూట్యూబ్లో వందల కోట్ల స్థాయిలో వినిపిస్తూ, ప్రతి శ్రావణంలో మళ్లీ మళ్లీ ట్రెండ్ అవుతున్న ఈ పాట వెనుక ఉన్న కథ కూడా అంతే ఆసక్తికరంగా ఉంది.
2018లో విడుదలైన బాలీవుడ్ మూవీ ‘కేదార్నాథ్’లోని ‘నమో నమో జీ శంకర’ పాట ఇప్పటికీ తన క్రేజ్ను ఏమాత్రం కోల్పోలేదు. సుశాంత్ సింగ్ రాజ్పుత్, సారా అలీ ఖాన్ జంటగా నటించిన ఈ మూవీ ప్రేమకథతో పాటు కేదార్నాథ్ ఆధ్యాత్మిక నేపథ్యాన్ని కూడా అద్భుతంగా చూపించింది. అయితే సినిమాలోని ఈ ఒక్క పాట మాత్రం సినిమాను మించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. శివునిపై ఉన్న భక్తిని, ఆధ్యాత్మిక అనుభూతిని సంగీత రూపంలో ఆవిష్కరించిన ఈ గీతం విడుదలైన నాటి నుంచి ఇప్పటివరకు కోట్లాది మందిని ఆకట్టుకుంటూనే ఉంది.
ఈ పాటకు సంగీత దర్శకుడు అమిత్ త్రివేది స్వరాలు అందించడమే కాకుండా స్వయంగా ఆలపించారు. గీత రచయిత అమితాబ్ భట్టాచార్య రాసిన సాహిత్యం పాటకు మరింత జీవం పోసింది. ప్రతి పదంలోనూ శివతత్వం ప్రతిబింబించేలా రాసిన ఈ గీతం భక్తి సంగీతంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ప్రస్తుతం జీ మ్యూజిక్ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో ఉన్న వీడియో ఒక్కటే 50 కోట్లకు పైగా వ్యూస్ సాధించింది. ఆడియో వెర్షన్లు, లిరికల్ వీడియోలు, ఇతర అప్లోడ్లు కలిపి ఈ పాట 100 కోట్లకు పైగా వ్యూస్ దాటి రికార్డ్ సృష్టించింది. వేలాది మంది ఈ పాటను కాలర్ ట్యూన్గా ఉపయోగించగా, లక్షలాది రీల్స్లో కూడా ఇది వినిపిస్తూ సోషల్ మీడియాలో నిరంతరం ట్రెండింగ్లో కొనసాగుతోంది.
ఈ పాట పుట్టుక వెనుక కూడా ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ‘కేదార్నాథ్’ దర్శకుడు అభిషేక్ కపూర్ సినిమా ప్రారంభంలోనే శివుడికి అంకితమైన ఓ ప్రత్యేక గీతం ఉండాలని భావించారు. మొదట అమిత్ త్రివేది, అమితాబ్ భట్టాచార్య కలిసి ‘బమ్ బమ్ బమ్’ తరహా పాటను సిద్ధం చేశారు. అయితే దర్శకుడికి అది నచ్చలేదు. శివుడి ఉగ్రరూపం కాకుండా, ఆయన ప్రశాంతమైన, కరుణామయమైన స్వరూపాన్ని ప్రేక్షకులకు చూపించాలని అభిషేక్ కపూర్ కోరుకున్నారు. ఆ సూచనను అర్థం చేసుకున్న అమితాబ్ భట్టాచార్య సాహిత్యాన్ని పూర్తిగా మార్చి, ఆధ్యాత్మికతతో నిండిన ‘నమో నమో జీ శంకర’ పాటను రచించారు. అమిత్ త్రివేది కూడా అదే భావానికి తగ్గట్టుగా స్వరాలను అందించడంతో ఈ గీతం ప్రజల మనసుల్లో నిలిచిపోయింది.
ప్రతి ఏడాది శ్రావణ మాసం ప్రారంభమయ్యే సమయంలో ఈ పాట మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటం దీని ప్రత్యేకత. ఆలయాల్లో, భక్తి కార్యక్రమాల్లో ఈ గీతం తప్పనిసరిగా వినిపిస్తోంది. ఎనిమిదేళ్లు గడిచినా అదే ఆదరణ కొనసాగుతుండటం, యూట్యూబ్లో కోట్లాది వ్యూస్ సాధించడం, ప్రతి కొత్త తరం ప్రేక్షకుడినీ ఆకట్టుకోవడం ఈ పాట సంచాలనానికి నిదర్శనం. ఒక అరుదైన భక్తి గీతంగా ‘నమో నమో జీ శంకర’ ఇప్పటికీ భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా మార్మోగుతోంది.

