Naagin: దాదాపు పదకొండేళ్లుగా బుల్లి తెరమీద అతీంద్రియ కథలతో ఆకట్టుకున్న ‘నాగిన్’ ఫ్రాంచైజీ ఇప్పుడు కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. నాగ పంచమి సందర్భంగా నిర్మాత ఏక్తా కపూర్ చేసిన ఒక్క ప్రకటన సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. బుల్లితెరను దాటి ‘నాగిన్’ ప్రపంచాన్ని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లనున్నట్లు ఆమె ప్రకటించడంతో, ఈ ఫ్రాంచైజీ వెండితెరపైకి రాబోతుందా అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా ఇప్పటివరకు నాగిన్ పాత్రలు పోషించిన ప్రముఖ నటీమణులంతా ఒకే ప్రాజెక్ట్లో కనిపించే అవకాశం ఉందనే ఊహాగానాలు అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.
ఏక్తా కపూర్ తన ఇన్స్టాగ్రామ్లో ప్రత్యేక వీడియోను విడుదల చేస్తూ, ఒక అద్భుతమైన విషయం రాబోతోందని, దాని కోసం ఎదురుచూడాలని పేర్కొన్నారు. నాగ పంచమి శుభాకాంక్షలు చెబుతూ షేర్ చేసిన ఆ వీడియోలో ‘నాగిన్’ ఫ్రాంచైజీ పదకొండేళ్ల ప్రయాణాన్ని గుర్తు చేశారు. అలాగే ఈ ఐకానిక్ ఫ్రాంచైజీని టెలివిజన్కు అతీతంగా తీసుకెళ్లేందుకు బాలాజీ టెలిఫిల్మ్స్ సిద్ధమైందని వీడియోలో స్పష్టం చేశారు. అయితే అది సినిమా అవుతుందా, ప్రత్యేక ప్రాజెక్టా లేదా మరో కొత్త ఫార్మాటా అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
ఈ ప్రకటనలో ఎక్కువగా ఆకట్టుకున్న అంశం ఆ వీడియోలో కనిపించిన నాగరాణులే. మొదటి నుంచి ఏడో సీజన్ వరకు ప్రధాన పాత్రల్లో నటించిన మౌని రాయ్, సుర్భి జ్యోతి, నియా శర్మ, సుర్భి చందన, తేజస్వి ప్రకాష్, ప్రియాంక చాహర్ చౌదరి ఒకే వీడియోలో కనిపించడం అభిమానుల్లో భారీ అంచనాలు పెంచింది. అదా ఖాన్, అనితా హసనందానిల గ్లింప్స్ కూడా కనిపించడంతో, గత సీజన్లలోని ప్రముఖ పాత్రలను ఒకే కథలో కలపబోతున్నారా అనే చర్చ మొదలైంది. ‘నాగిన్’ ప్రయాణం 2015లో ప్రారంభమైంది. మొదటి సీజన్లో మౌని రాయ్ ఇచ్ఛాధారి నాగిన్గా, అర్జున్ బిజ్లానీ హీరోగా నటించగా, పౌరాణిక అంశాలు, ఫాంటసీ, ప్రేమ, కుటుంబ భావోద్వేగాల కలయిక ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ విజయంతో ఈ సీరీస్ భారతీయ టెలివిజన్లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల్లో ఒకటిగా నిలిచింది.
తర్వాతి సీజన్లలో కొత్త కథలతో పాటు కొత్త నాగరాణులు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రెండో సీజన్లో మౌని రాయ్ కొనసాగగా, మూడో సీజన్లో సుర్భి జ్యోతి, నాలుగో సీజన్లో నియా శర్మ, ఐదో సీజన్లో సుర్భి చందన, ఆరవ సీజన్లో తేజస్వి ప్రకాష్ ప్రధాన పాత్రలు పోషించారు. ఏడో సీజన్లో ప్రియాంక చాహర్ చౌదరి కథను ముందుకు నడిపించారు. ఈ సీజన్ 2025లో ప్రారంభమై 2026 జూన్ 14న ముగిసింది. ఇప్పుడు వెండితెరపై ‘నాగిన్’ ప్రపంచం వస్తుందనే సంకేతాలు రావడంతో మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
భారతీయ సినీ చరిత్రలో నాగిన్ కథలకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా శ్రీదేవి నటించిన ‘నగీనా’ ఇప్పటికీ ఈ జానర్లో క్లాసిక్గా గుర్తింపు పొందుతోంది. ‘నగీనా’ 1986లో విడుదలైన ఒక ఐకానిక్ బాలీవుడ్ ఫాంటసీ బ్లాక్బస్టర్ చిత్రం. దీనిని తెలుగులో ‘నాగిని’ పేరుతో అనువాదం చేశారు. ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి రూపం మార్చుకోగల ‘రజని’ అనే ఇచ్ఛాధారి నాగకన్య పాత్రలో అద్భుతంగా నటించి, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. హర్మేష్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రిషి కపూర్ హీరోగా నటించగా, అమ్రిష్ పురి ఒక క్రూరమైన మాంత్రికుడి (భైరవ్ నాథ్) పాత్రలో నటించారు. తన భర్తను, నాగమణిని కాపాడుకోవడానికి ఆ దుష్ట మాంత్రికుడితో ఒక నాగకన్య చేసిన పోరాటమే ఈ సినిమా ముఖ్య కథాంశం. ఈ సినిమా సాధించిన ఘనవిజయం శ్రీదేవిని బాలీవుడ్లో తిరుగులేని లేడీ సూపర్ స్టార్గా నిలబెట్టింది.
అయితే ఏక్తా కపూర్ కొత్త ప్రాజెక్ట్ అదే స్థాయి ప్రభావాన్ని చూపగలదా, లేటెస్ట్ విజువల్స్తో కొత్త తరం ప్రేక్షకులను ఆకట్టుకోగలదా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్పై పూర్తి వివరాలు బయటకు రాలేదు. విడుదల తేదీ, ఫార్మాట్, కథ, తారాగణంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయినప్పటికీ, పదకొండేళ్ల టెలివిజన్ వారసత్వాన్ని ఇప్పుడు మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లబోతున్నట్లు ఏక్తా కపూర్ ఇచ్చిన సంకేతం మాత్రం ‘నాగిన్’ అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది. ఈ సినిమా ఎప్పుడు వెండితెర మీద అలరించబోతోందనే ఆసక్తి ఇప్పుడు ‘నాగిన్’ అభిమానుల్లో కనిపిస్తోంది.

