Miss Universe India 2026: కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో అందాల పోటీలో సత్తా చాటి మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. రాజస్థాన్లోని జైపూర్లో 2026 ఆగస్టు 23న జరిగిన గ్రాండ్ ఫినాలేలో దేశవ్యాప్తంగా వచ్చిన పోటీదారులను వెనక్కి నెట్టి ఆమె విజేతగా నిలిచారు. ప్రస్తుత మిస్ యూనివర్స్ ఇండియా 2025 మణికా విశ్వకర్మ.. కజియాకు కిరీటం తొడిగి అభినందనలు తెలియజేశారు. ఈ విజయంతో కజియా ఇప్పుడు భారతదేశం తరఫున ఇంటర్నేషనల్ గా జరిగే పోటీల్లో కూడా అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు.
ఇక మిస్ యూనివర్స్ ఇండియా 2026 పోటీ కోసం కూడా దేశవ్యాప్తంగా ఆడిషన్లు, ఇంటర్వ్యూలు చాలానే నిర్వహించారు. వీటి ద్వారా మొత్తం 52 మంది ఫైనల్ లిస్ట్ కు చేరుకున్నారు. చివరి రౌండ్లలో అందం, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, భారతీయ సంస్కృతిపై అవగాహన వంటి అంశాల్లో పోటీదారులను పరీక్షించారు. ఈ అన్ని దశల్లోనూ ఆకట్టుకున్న కజియా లిజ్ మెజో చివరకు విజేతగా నిలిచారు. ఇక ఈ తుది ఫలితాల్లో తమిళనాడుకు చెందిన వైష్ణవి గణేష్ ఫస్ట్ రన్నరప్గా నిలిచారు. గుజరాత్కు చెందిన అనుశ్రీ సతావలేకర్ సెకండ్ రన్నరప్గా ఎంపికయ్యారు. దీంతో ఈ ముగ్గురు అందాల భామలు 2026 పోటీలో టాప్ స్థానాలను సొంతం చేసుకున్నారు.
ఈసారి మిస్ యూనివర్స్ ఇండియా ఫినాలేకు ప్రముఖులు జ్యూరీ సభ్యులుగా వ్యవహరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 1994లో భారత్కు తొలి మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందించిన సుష్మితా సేన్ జ్యూరీకి నాయకత్వం వహించారు. మాజీ మిస్ యూనివర్స్ ఇండియా విజేతలు సెలీనా జైట్లీ, ఊర్వశి రౌతేలా, రియా సింఘాతో పాటు ప్రజ్ఞా కపూర్, విషా లధియా, అన్నా బ్లాంకో, డాక్టర్ స్టుటి ఖరే శుక్లా తదితరులు జ్యూరీ ప్యానెల్లో ఉన్నారు.
అయితే కజియా విజయం ఇక్కడితో ఆగిపోవడం లేదు. జాతీయ స్థాయిలో కిరీటం గెలుచుకున్న ఆమెకు ఇప్పుడు అంతర్జాతీయంగా భారత్కు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. నవంబర్లో ప్యూర్టో రికోలో జరగనున్న 75వ మిస్ యూనివర్స్ పోటీలో కజియా లిజ్ మెజో భారత్ తరఫున బరిలోకి దిగనున్నారు. దీంతో ప్రపంచ వేదికపై తన ప్రతిభను చాటుకునే అవకాశం ఈ 19 ఏళ్ల యువతికి లభించింది.
ఈ విజయం అనంతరం కజియా ఈ కిరీటం తనకు ఒక అందాల పోటీ గెలుపు మాత్రమే కాదని, ఇదొక గొప్ప బాధ్యత అని పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికపై భారతదేశ సంస్కృతి, ప్రతిభ, కొత్త తరం ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఈసారి మిస్ యూనివర్స్ కిరీటాన్ని కూడా భారత్కు తీసుకురావాలనే ఆశాభావంతో ఉన్నారు.
కేరళకు చెందిన ఈ యువతి జాతీయ స్థాయిలో తన పేరు నిలబెట్టుకున్న నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు ప్యూర్టో రికో వేదికపైనే ఉంది. గతంలో సుష్మితా సేన్, లారా దత్తా, హర్నాజ్ సంధు వంటి భారతీయ అందాల భామలు మిస్ యూనివర్స్ కిరీటాన్ని సాధించారు. మరి ఇప్పుడు కజియా లిజ్ మెజో కూడా అదే ఘనమైన వారసత్వాన్ని కొనసాగించి భారత్కు మరో అంతర్జాతీయ కిరీటం అందిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

