సాధారణంగా ఏ సినిమా ఫస్ట్ లుక్ లేదా టీజర్ లాంచ్ చేయాలన్నా అగ్ర హీరోలనో, స్టార్ డైరెక్టర్లనో ముఖ్య అతిథులుగా తీసుకురావడం ఇండస్ట్రీలో ఆనవాయితీ. కానీ, అందుకు పూర్తి భిన్నంగా స్కూల్ పిల్లల చేతుల మీదుగా ఓ సినిమా గ్లింప్స్ను విడుదల చేసి ‘ధామా టేల్స్’ నిర్మాణ సంస్థ సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫుట్బాల్ దిగ్గజం పేరుతో తెరకెక్కిన ఆ చిత్రమే ‘మెస్సి – లవ్ ఫ్రమ్ ఇండియా’. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బడి పిల్లలతో ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ లాంచ్ చేయడం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మలయాళంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఆంటోని వర్గీస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నిఖిల్ ప్రేమ్ రాజ్ దర్శకత్వం వహించారు. ఆకర్ష ఆలపాటి సమర్పణలో ధామా టేల్స్ బ్యానర్పై ఆవిడే స్వయంగా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండటం విశేషం.
పిల్లల ద్వారా ఈ సినిమా ప్రమోషన్స్ ప్రారంభించడానికి ఒక బలమైన కారణం ఉందని నిర్మాత ఆకర్ష ఆలపాటి లాంచ్ ఈవెంట్లో తెలిపారు. చిన్నతనం నుంచే క్రియేటివ్గా ఆలోచించే తనకు, కొత్త ప్రతిభను, చిన్న పిల్లలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు ఆమె చెప్పారు. మలయాళంలో అద్భుతంగా వచ్చిన ఈ చిత్రాన్ని తెలుగు వారికి అందించాలనే తపనతో ఇక్కడికి తీసుకొచ్చామన్నారు. ఈ సినిమా కాన్సెప్ట్కు తగ్గట్టుగానే ఏకంగా బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14వ తేదీన ‘మెస్సి’ చిత్రాన్ని థియేటర్లలో భారీగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. పీవీఆర్ ఉదయ్, వెంకట్ వంటి వారు తమకు ఎంతో అండగా నిలిచారని, ధామా టేల్స్ బ్యానర్ ద్వారా భవిష్యత్తులో మరిన్ని వినూత్న ప్రాజెక్టులు తీసుకువస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మైదానంలో సాకర్ ప్లేయర్ మెస్సి తన ఆటతో ఎలాగైతే అదరగొడతాడో.. థియేటర్లలో ఈ సినిమా కూడా అదే రేంజ్లో ఆడుతుందని కార్యక్రమంలో పాల్గొన్న అర్జున్ ఆశాభావం వ్యక్తం చేశారు. ధామా టేల్స్ సంస్థ ఎప్పుడూ కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేస్తుందని, ఈ చిత్రానికి అందరి ఆశీస్సులు కావాలని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అరవింద్ బత్తిని కోరారు.

