777 Charlie: సినిమా చూసి ఏడ్చిన ముఖ్యమంత్రి.. తట్టుకోలేకపోతున్నా అంటూ

Basavaraj Bommai

Basavaraj Bommai

కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘777 చార్లీ’. కిరణ్‌రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3 న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. పెంపుడు కుక్క ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూసి కంటతడి పెట్టుకుంటున్నారు. ఇక ఇప్పటికే అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ‘777 చార్లీ’ సినిమాను వీక్షించి కంటతడి పెట్టారు. థియేటర్లో ఆయన వెక్కి వెక్కి ఏడ్చారు. ఈ సినిమా చూసి తన పెట్ డాగ్ గుర్తొచ్చిందని చెప్పుకొచ్చారు. గత కొన్నేళ్ల క్రితం సీఎం ఇంట్లో స్నూపీ అనే ఒక కుక్కపిల్ల ఉండేది. దాన్ని ఆ కుటుంబం ఎంతో ప్రేమగా చూసుకొనేది. అయితే దురదృష్టవశాత్తు ఆయన సీఎం పదవి చేపట్టడం కంటే ముందే ఆ శునకం కన్నుమూసింది.

ఇక కుక్క చనిపోవడంతో సీఎం బాధను ఆపడం ఎవరి తరం కాలేదు.. అంతేకాదు సీఎం అయ్యాక.. ఓ ఇంటర్వ్యూలో స్నూబీ ఫొటోల్ని చూపించగా కన్నీటి పర్యంతం అయ్యారు. ఇక ఈ సినిమా చూసిన ఆయన తన స్నూబీ గుర్తొచ్చిందని చెప్పుకొచ్చారు. “అంతకుముందు కుక్కల మీద వచ్చిన ఎన్నో సినిమాలు చూసాను కానీ చార్లీ భావోద్వాగాన్ని నింపింది. సినిమా బాగుంది, అందరూ తప్పకుండా చూడాల్సిందే. కుక్క ప్రేమ షరతులు లేనిది.. అది కుక్కలను పెంచేవారికి మాత్రమే తెలుస్తుంది” అని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాను తెలుగులో రానా దగ్గుబాటి, సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.