తెలంగాణలోని నిరుద్యోగ నిరుద్యోగులకు TGPSC (తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) చైర్మన్ బుర్ర వెంకటేశం ఒక పెద్ద శుభవార్త చెప్పారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో వేగం పెంచడంతో పాటు, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా సరికొత్త మార్పులు తీసుకువస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, నిరుద్యోగుల్లో నమ్మకం కలిగించేలా పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు.
ప్రతి నెల మూడు నోటిఫికేషన్లు.. రేపే ప్రారంభం..
ప్రభుత్వం నుంచి ప్రస్తుతం 3,800 ఉద్యోగ పోస్టుల భర్తీకి అనుమతులు వచ్చాయని చైర్మన్ తెలిపారు. ఈ పోస్టుల భర్తీ కోసం ఇకపై క్రమంతప్పకుండా రెగ్యులర్ గా నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్నారు. ఇందులో భాగంగా ప్రతి నెల సగటున మూడు నోటిఫికేషన్లు ఇస్తామని, రేపే మూడు కొత్త నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నామని ఆయన ప్రకటించారు.
ఏడాదిలోనే భర్తీ పూర్తి..
ఉద్యోగ నియామక ప్రక్రియ ఏది ప్రారంభించినా, దానిని గరిష్టంగా ఒక ఏడాది లోపే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. అలాగే.. ఇకపై TGPSC నిర్వహించే నియామక పరీక్షలన్నీ పూర్తిగా కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ మోడ్ (CBRT) లోనే జరుగుతాయని తెలిపారు. దీనివల్ల పేపర్ లీకేజీలకు అవకాశం ఉండదని, పరీక్ష పేపర్ను ముందే తయారు చేయడం అనేది ఇకపై ఉండదని చెప్పారు. వీలైతే అభ్యర్థులు పరీక్ష రాసిన వెంటనే ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాశారో కూడా తెలిసిపోయేలా సాంకేతికతను తీసుకువస్తున్నట్లు హింట్ ఇచ్చారు.
పారదర్శకతకు పెద్ద పీట..
ఉద్యోగ నియామకాల్లో మొదట నోటిఫికేషన్, తర్వాత పరీక్ష, ఆపై మెరిట్ లిస్ట్, చివరిగా సెలక్షన్ లిస్ట్ అనే పారదర్శక విధానాన్ని ఖచ్చితంగా పాటిస్తామన్నారు. పరీక్షల్లో ఎలాంటి లోపాలు లేవనే నమ్మకాన్ని అభ్యర్థుల్లో కలిగించడానికే తామంతా పనిచేస్తున్నామని చెప్పారు.
ఇదే సమయంలో ఆయన ఒక ప్రాధాన్యత గల విషయాన్ని గుర్తుచేశారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాదని, కేవలం 0.1 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. ఉద్యోగం రాని మిగతా వాళ్ళు కమిషన్పై దుష్ప్రచారం చేయడం సహజమేనని, అయితే అభ్యర్థులు అలాంటి వదంతులను నమ్మవద్దని ఆయన కోరారు. మొత్తానికి TGPSC తీసుకొస్తున్న ఈ మార్పులు నిరుద్యోగుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి.
