43 Jersey Cows Gifted to Bhutan: భారత్-భూటాన్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ భూటాన్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తన అధికారిక పర్యటనలో భాగంగా బూమ్తాంగ్లోని నేషనల్ క్యాటిల్ బ్రీడింగ్ సెంటర్ను సందర్శించిన ఆయన.. భూటాన్కు భారత్ తరఫున 43 స్వచ్ఛమైన జెర్సీ జాతి ఆవులను అందజేశారు.
రైతులకు, డెయిరీ రంగానికి ప్రయోజనం
భూటాన్లో పాల ఉత్పత్తిని పెంచడంతో పాటు స్థానిక రైతులకు మద్దతు అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని జైశంకర్ తెలిపారు. భారత్ నుంచి అందించిన ఈ స్వచ్ఛమైన జెర్సీ ఆవులు భూటాన్ డెయిరీ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 40 వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని జైశంకర్ వెల్లడించారు. పాల ఉత్పత్తి పెరగడం ద్వారా స్థానిక రైతుల ఆదాయానికి కూడా మద్దతు లభించనుంది.
వాంగదుయెచోలింగ్ ప్యాలెస్ను సందర్శించిన జైశంకర్
ఆవులను అందజేసిన అనంతరం జైశంకర్ చారిత్రక వాంగదుయెచోలింగ్ ప్యాలెస్ అండ్ మ్యూజియంను సందర్శించారు. ఈ ప్రాంతం గతంలో రాజ నివాసంగా, దర్బార్గా ఉపయోగించారు. భూటాన్ చరిత్ర, కళలు, హస్తకళలు, వాస్తుశిల్పానికి సంబంధించిన అనేక అంశాలు ఈ మ్యూజియంలో కనిపిస్తాయి. ఆధునిక భూటాన్ నిర్మాణంలో రాజరిక వ్యవస్థ పోషించిన పాత్రకు ఈ ప్యాలెస్ నిదర్శనంగా నిలుస్తుందని జైశంకర్ పేర్కొన్నారు.
పవిత్ర కుర్జే ల్హాఖాంగ్లో ప్రార్థనలు
జైశంకర్ భూటాన్లోని అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటైన కుర్జే ల్హాఖాంగ్ను కూడా సందర్శించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భారత్-భూటాన్ ప్రజల సంక్షేమం, రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.
భూటాన్ విదేశాంగ మంత్రితో కీలక చర్చలు
భూటాన్ విదేశాంగ మంత్రి ల్యోన్పో డీఎన్ ధుంగ్యెల్తో కూడా జైశంకర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి. అభివృద్ధి భాగస్వామ్యం, ఇంధనం, వాణిజ్యం, కనెక్టివిటీ, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలతో పాటు ఇతర ద్వైపాక్షిక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. భారత్-భూటాన్ మధ్య ఉన్న పరస్పర విశ్వాసం, స్నేహపూర్వక సంబంధాలకు ఈ చర్చలు నిదర్శనమని జైశంకర్ పేర్కొన్నారు.
పలు ద్వైపాక్షిక ప్రాజెక్టులకు శ్రీకారం
సమావేశం అనంతరం ఇరు దేశాల మంత్రులు మౌలిక వసతులు, ఇంధనం, ఆరోగ్య రంగాలకు సంబంధించిన పలు ద్వైపాక్షిక ప్రాజెక్టులను ప్రారంభించారు. భారత్-భూటాన్ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ ప్రాజెక్టులు కీలకంగా నిలవనున్నాయి.
సెప్టెంబర్ 16-17న భూటాన్లో జైశంకర్ పర్యటన
భూటాన్ విదేశాంగ మంత్రి డీఎన్ ధుంగ్యెల్ ఆహ్వానం మేరకు జైశంకర్ సెప్టెంబర్ 16, 17 తేదీల్లో భూటాన్లో అధికారిక పర్యటన చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గ్యెల్ వాంగ్చుక్తో సమావేశం కానున్నారు. అలాగే భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేతో కూడా భేటీ కానున్నారు. భారత్, భూటాన్ మధ్య చాలాకాలంగా సన్నిహిత, స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయి. తాజా పర్యటనలో డెయిరీ రంగం నుంచి మౌలిక వసతులు, ఇంధనం, ఆరోగ్యం వరకు పలు రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించే అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

