Syria New Parliament: దశాబ్దాల సుదీర్ఘ నియంతృత్వం, రక్తపాతంతో కూడిన అంతర్యుద్ధం తర్వాత ప్రస్తుతం సీరియా సరికొత్త ప్రజాస్వామ్య శకం వైపు అడుగులు వేస్తోంది. డిసెంబర్ 2024లో అల్-అసద్ కుటుంబానికి చెందిన ఐదు దశాబ్దాల క్రూర సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత, దేశంలో తొలిసారిగా కొత్త పార్లమెంట్ (సెంటినల్ అసెంబ్లీ) ఏర్పాటుకు మార్గం సుగమమైంది. బుధవారం నాడు అధ్యక్షుడు అహ్మద్ అల్-శరా 70 మంది ఎంపీల జాబితాను అధికారికంగా విడుదల చేశారు.
మొత్తం 210 మంది సభ్యులు..
సీరియా ఎన్నికల కమిటీ అధినేత మహ్మద్ తాహా అల్-శరా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నూతన పార్లమెంట్లో మొత్తం 210 మంది సభ్యులు ఉంటారు. వీరందరితో రాబోయే సోమవారం నాడు తొలి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే నూతన సభ్యుల ప్రమాణ స్వీకారంతో పాటు, పార్లమెంటరీ ప్రెసిడెన్షియల్ కౌన్సిల్ ఎన్నిక కూడా జరగనుంది. అధ్యక్షుడు అల్-శరా ఎంపిక చేసిన 70 మంది సభ్యుల జాబితాలో 15 మంది మహిళలకు స్థానం కల్పించడం విశేషం. దీనితో కలిపి సీరియా కొత్త పార్లమెంట్లో మొత్తం మహిళా సభ్యుల సంఖ్య 22కు చేరింది.
వివాదాస్పద ప్రాంతాలకూ ప్రాతినిధ్యం..
గత అక్టోబర్లో జరిగిన మొదటి విడత పార్లమెంట్ ఎన్నికల్లో కుర్దిష్ నియంత్రణలో ఉన్న ఈశాన్య సీరియా, అలాగే కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక ‘ద్రూజ్’ సాయుధుల ఆధీనంలో ఉన్న దక్షిణ ప్రాంతం ‘సువేదా’లను మినహాయించారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ఈశాన్య సీరియాను ప్రభుత్వ బలగాలు స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడ మే నెలలో ఎన్నికలు నిర్వహించారు. ‘సువేదా’లో ఇంకా ఎన్నికల తేదీ ఖరారు కానప్పటికీ, అధ్యక్షుడు విడుదల చేసిన జాబితాలో ఆ ప్రాంతానికి చెందిన ఇద్దరు ప్రతినిధులకు చోటు కల్పించడం విశేషం. ఈ సరికొత్త పార్లమెంట్ పదవీ కాలం 30 నెలలు (రెండున్నర ఏళ్లు) మాత్రమే ఉంటుంది. ఈ లోపు దేశంలో పూర్తిస్థాయి ప్రజాస్వామ్యబద్ధమైన సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా ఒక పటిష్టమైన ‘కొత్త ఎన్నికల చట్టాన్ని’ రూపకల్పన చేయడం ఈ పార్లమెంట్ యొక్క ప్రధాన విధిగా అధ్యక్షుడు పేర్కొన్నారు. దాదాపు 5 లక్షల మంది ప్రాణాలను బలిగొన్న భీకర అంతర్యుద్ధం, హయాత్ తహ్రీర్ అల్-షామ్ తిరుగుబాటు తర్వాత, సీరియాలో చట్టబద్ధమైన పాలనను పునరుద్ధరించే దిశగా ఈ పార్లమెంట్ ఏర్పాటు అత్యంత కీలకమైన మైలురాయిగా నిలవనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

