Site icon NTV Telugu

Ukraine Russia War: రంగంలోకి ఆత్మాహుతి డ్రోన్లు..!

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతూనే ఉంది.. మరోవైపు శాంతి స్థాపన కోసం జరిగే చర్చలు విఫలం అవుతూనే ఉన్నాయి.. ఇవాళ మరోసారి శాంతి చర్చలు జరగనున్నాయి.. ఉక్రెయిన్‌పై దాడి ఆపాలన్న అంతర్జాతీయ కోర్టు ఆదేశాలను రష్యా తిరస్కరిచింది. ఉక్రెయిన్‌లో రోజుల తరబడి మారణహోమం కొనసాగిస్తూనే ఉంది. వెంటనే మిలటరీ ఆపరేషన్‌ను ఆపేసి… ఉక్రెయిన్‌ నుంచి రష్యా బలగాలను వెనక్కి రప్పించాలని అంతర్జాతీయ కోర్టు ఆదేశించింది. ఇకపై ఎలాంటి దాడులకు పాల్పడకూడదని… పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలిపింది. అంతర్జాతీయ కోర్టు ఆదేశాలను రష్యా పాటించి తీరాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ కూడా డిమాండ్ చేశారు. అయితే అంతర్జాతీయ కోర్టు ఆదేశాలను కూడా పక్కన పెట్టేసింది రష్యా.

Read Also: Elon Musk: టెస్లా వ్యవస్థాపకుడి షాకింగ్‌ నిర్ణయం

మరోవైపు… ఉక్రెయిన్‌కు బ్రహ్మాస్త్రం అందిస్తోంది అమెరికా. ఆత్మాహుతి డ్రోన్లను యుద్ధరంగంలోకి దింపుతోంది. ఇప్పటికే జావెలిన్‌, స్టింగర్‌తో ఉక్రెయిన్‌ డిఫెన్స్‌ను బలోపేతం చేసిన అమెరికా.. ఇప్పుడు స్విచ్‌ బ్లేడ్‌ డ్రోన్లను ఉక్రెయిన్‌కు పంపిస్తోంది. ఈ డ్రోన్లు రష్యా సైనిక వాహనాలను, కాన్వాయ్‌లను దెబ్బతీస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ క్షిపణులతో రష్యన్ల ట్యాంక్‌లను దెబ్బతీస్తున్న ఉక్రెయిన్‌కు… ఈ డ్రోన్ల రూపంలో మరో అస్త్రం అందినట్టయ్యింది. స్విచ్‌ బ్లేడ్‌ డ్రోన్లతో కొన్ని కిలోమీటర్ల నుంచే శత్రువులపై దాడిచేయొచ్చు. అటు.. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరంపైనా రష్యా రాకెట్‌ బాంబులను ప్రయోగిస్తోంది. మొత్తానికి.. రష్యా ఉక్రెయిన్‌పై దాడులను ఆపటం లేదు. ఉక్రెయిన్‌ సైతం రష్యన్ సేనలను దీటుగానే ఎదుర్కొంటోంది. అయితే, అంతర్జాతీయ కోర్టు ఆదేశాలను సైతం రష్యా ధిక్కరించటంతో ఈ యుద్ధం ఎప్పుడు అంతం అవుతుందనేది మాత్రం ఇంకా మిస్టరీగానే మారింది.

Exit mobile version