దక్షిణ కొరియాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. డేజియోన్ నగరంలోని కారు విడిభాగాల కర్మాగారంలో పెద్ద ఎత్తున పేలుడు జరిగింది. దీంతో ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమీప ప్రాంతాల్లో పొగ దట్టంగా అలుముకుంది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా.. మరో 59 మంది తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. మరో 14 మంది ఆచూకీ తెలియనట్లుగా సమాచారం. అయితే మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
శుక్రవారం మధ్యాహ్నం 1:18 గంటల సమయంలో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రమాదానికి గల కారణాలైతే ఇంకా తెలియలేదు. కానీ భారీ పేలుడు సంభవించినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అయితే పేలుడు ధాటికి ఫ్యాక్టరీ ధ్వంసం అయినట్లుగా తెలుస్తోంది. 500 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు.
