OPEC+ : ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు మండిపోతున్న తరుణంలో, చమురు ఉత్పత్తి దేశాల కూటమి ‘ఒపెక్ ప్లస్’ (OPEC+) కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నెల నుంచి రోజుకు సుమారు 1.88 లక్షల బ్యారెళ్ల (bpd) మేర అదనపు ఉత్పత్తిని పెంచడానికి ఈ కూటమి సిద్ధమవుతోంది. ఉత్పత్తి పెంచడం ఇది వరుసగా మూడవ నెల కావడం గమనార్హం. ఉత్పత్తి పెంచాలనే నిర్ణయం సానుకూలమైనదే అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది వినియోగదారులకు పెద్దగా ఊరటనిచ్చేలా కనిపించడం లేదు. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.
గత కొంతకాలంగా కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ యుద్ధం చమురు సరఫరా గొలుసును దెబ్బతీసింది. అలాగే ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హోర్ముజ్ జలసంధి మూతపడటంతో, ఉత్పత్తి పెంచినా అది మార్కెట్కు చేరే మార్గం లేకుండా పోయింది. ఈ సముద్ర మార్గం పునరుద్ధరించబడే వరకు అదనపు ఉత్పత్తి వల్ల ప్రయోజనం శూన్యం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, అల్జీరియా, కజకిస్థాన్, రష్యా, ఒమన్ సమావేశం అయ్యాయి. ఇటీవలే ఈ కూటమి నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వైదొలిగినప్పటికీ, మిగిలిన దేశాలు తమ ఉత్పత్తి పెంపు వ్యూహానికి కట్టుబడి ఉన్నాయి. సరఫరాలో అంతరాయాల కారణంగా, ఈ వారం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు 125 డాలర్లను దాటింది. ఇది గత నాలుగేళ్లలో అత్యధిక గరిష్ఠ స్థాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడమే కాకుండా, జెట్ ఇంధన కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాధారణ స్థితికి రావడం ఇప్పుడే సాధ్యమేనా?
ఒకవేళ హోర్ముజ్ జలసంధిని వెంటనే తెరిచినప్పటికీ, సరఫరా వ్యవస్థ మళ్లీ గాడిలో పడటానికి వారాలు లేదా నెలలు పట్టే అవకాశం ఉంది. మార్చి నెలలో సౌదీ అరేబియా, ఇరాక్ వంటి దేశాల్లో ఉత్పత్తి గణనీయంగా పడిపోయి, రోజుకు 35.06 మిలియన్ బ్యారెళ్లకు చేరుకుంది. పరిస్థితులు మెరుగుపడినప్పుడు తగినంత సరఫరా అందిస్తామని మార్కెట్కు భరోసా ఇవ్వడానికే ఒపెక్+ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. యుద్ధం ముగిసి, రవాణా మార్గాలు తెరుచుకుంటే తప్ప పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
