Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం

  • గతేడాది సెప్టెంబర్‌లో చార్లీ కిర్క్ హత్య
  • తాజాగా కుటుంబ సభ్యులు సంచలన నిర్ణయం
  • నష్టపరిహారం కోరుతూ న్యాయపరమైన చర్యలు
Charlie Kirks

Charlie Kirks

గతేడాది సెప్టెంబర్‌లో యూటా వ్యాలీ యూనివర్సిటీలో ట్రంప్ సన్నిహితుడు, టర్నింగ్ పాయింట్ అమెరికా సంస్థ అధినేత చార్లీ కిర్క్ హత్యకు గురయ్యారు. దుండగుడు తుపాకీతో కాల్చడంతో ప్రసంగిస్తూ కుప్పకూలిపోయారు. అయితే ఈ కేసులో నిందితుడు 23 ఏళ్ల టైలర్ రాబిన్సన్‌‌ను క్షమించినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. తాజాగా కేసులో కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. యూనివర్సిటీపై దావా వేసేందుకు సిద్ధమయ్యారు. యూనివర్సిటీ, యుటా రాష్ట్ర అధికారులపై నష్టపరిహారం కోరుతూ న్యాయపరమైన చర్యలకు సిద్ధమైంది. భద్రతా లోపాలే కిర్క్ హత్యకు దోహదపడ్డాయని కుటుంబం ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించి కుటుంబ న్యాయవాదులు సెప్టెంబర్ 9న ‘Notice of Claim’ జారీ చేశారు.

భద్రతపై ముందే హెచ్చరించాం..

చార్లీ కిర్క్‌కు చెందిన సంస్థ టర్నింగ్ పాయింట్ యూఎస్ (Turning Point USA (TPUSA) యూనివర్సిటీ పోలీసులను ముందుగానే అప్రమత్తం చేసిందని కుటుంబం పేర్కొంది. కిర్క్ ప్రసంగించాల్సిన యూనివర్సిటీ యాంఫీథియేటర్‌ను ఆనుకుని ఉన్న భవనాల పైకప్పుల నుంచి ముప్పు ఉండొచ్చని పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. ఈ విషయంపై యూనివర్సిటీ పోలీస్ చీఫ్ జెఫ్రీ లాంగ్.. TPUSA సిబ్బందికి “I got you covered” అంటూ భరోసా ఇచ్చినట్లు కుటుంబం దాఖలు చేసిన నోటీసులో పేర్కొన్నారు. అయితే కిర్క్‌పై కాల్పులు జరిపిన భవనం పైకప్పుకు యాక్సెస్‌ను పోలీసులు నియంత్రించలేకపోయారని కుటుంబం ఆరోపించింది.

పైకప్పు నుంచే కాల్పులు..

2025 సెప్టెంబర్ 10న కార్యక్రమంలో పాల్గొన్న చార్లీ కిర్క్‌పై ఓ భవనం పైకప్పు నుంచి కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుమారు 3,000 మంది పాల్గొన్న కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో 23 ఏళ్ల టైలర్ రాబిన్సన్‌పై హత్యకు సంబంధించిన అభియోగాలు నమోదయ్యాయి. అతడు నేరాన్ని అంగీకరించలేదు. ప్రాసిక్యూటర్లు మరణశిక్షను కోరుతున్నారు. ఇటీవల కోర్టు విచారణకు కేసును పంపేందుకు అనుమతించింది. తదుపరి విచారణలో ట్రయల్ తేదీ ఖరారు చేసే అవకాశం ఉంది.

రాబిన్సన్‌కు ఒక బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని, అతను లింగ మార్పు గురించి ఆలోచిస్తున్నాడని, అలాగే స్వలింగ వివాహాలు, ట్రాన్స్‌జెండర్ హక్కులపై కిర్క్ వ్యతిరేక అభిప్రాయాలు కలిగి ఉండటంతోనే అతడిని లక్ష్యంగా చేసుకున్నాడని ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. అయితే, కిర్క్ కొన్ని సందర్భాల్లో LGBTQ+ వ్యక్తులపై తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ, అవి హత్యకు ఉద్దేశాన్ని నిరూపించే ఆధారాలు కావని రాబిన్సన్ తరఫు న్యాయవాది రిచర్డ్ నోవాక్ కోర్టులో వాదించారు. ఈ అంశంపై తుది నిర్ణయం కోర్టు విచారణలో వెలువడాల్సి ఉంది.

యూనివర్సిటీపై కుటుంబం ఆరోపణలు

కిర్క్ కుటుంబం దాఖలు చేసిన నోటీసులో భద్రతా ఏర్పాట్లపై పలు ఆరోపణలు చేసింది. ఈ ఘటనకు ముందు ఉన్న భద్రతా ముప్పులను సరిగా అంచనా వేయలేదని, పైకప్పులపై ప్రవేశాన్ని నియంత్రించలేదని, తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదని కుటుంబం పేర్కొంది. నోటీసు తమకు అందిందని, నిర్ణీత న్యాయ ప్రక్రియ ప్రకారం వ్యవహరిస్తామని యుటా వ్యాలీ యూనివర్సిటీ తెలిపింది.