ప్రపంచంలో ప్రతి ముగ్గురిలోని ఒకరి శరీరంలో ఒక ప్రమాదకర పరాన్నజీవి దాగి ఉందని చెబితే నమ్ముతారా? అది చాలా మందికి ఎలాంటి లక్షణాలు చూపించకపోవచ్చు. కానీ సరైన పరిస్థితులు ఏర్పడితే అదే పరాన్నజీవి మన కంటి చూపును శాశ్వతంగా దెబ్బతీయగలదు. గర్భంలో పెరుగుతున్న శిశువు ప్రాణానికే ప్రమాదంగా మారగలదు. ఇంతటి ముప్పు ఉన్నా ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలో దీనికి ఇంకా తగిన ప్రాధాన్యం దక్కలేదని శాస్త్రవేత్తలు ఇప్పుడు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ పారాసైట్ ఏంటి? అది ఎంత ప్రమాదకరం?

టోక్సోప్లాస్మా గోండీ అంటే?
ఆ పరాన్నజీవి పేరు టోక్సోప్లాస్మా గోండీ. ఇది కలిగించే వ్యాధిని టోక్సో-ప్లాస్మోసిస్ అంటారు. ప్రపంచ జనాభాలో దాదాపు మూడింట ఒక వంతు మందికి ఈ పరాన్నజీవి ఎప్పుడో ఒకసారి సంక్రమించి ఉండవచ్చని అంచనాలు చెబుతున్నాయి.
చాలా మంది ఆరోగ్యవంతులలో ఇది ఎలాంటి లక్షణాలు కనిపించకుండా శరీరంలోనే దాగి ఉండిపోతుంది. కానీ కొందరిలో మాత్రం ఇది కంటి లోపల తీవ్రమైన ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కంటి ఇన్ఫెక్షన్లలో అత్యంత సాధారణ కారణం కూడా ఇదే. చికిత్స ఆలస్యమైతే చూపు పూర్తిగా కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ జస్టిన్ స్మిత్, బ్రెజిల్లోని సావో పాలో యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఫుర్టాడో సహా పరిశోధకులు ఒక కీలక అభిప్రాయ పత్రాన్ని విడుదల చేశారు. వారి అభిప్రాయం ప్రకారం టోక్సో-ప్లాస్మోసిస్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్లక్ష్యానికి గురైన ఉష్ణమండల వ్యాధుల జాబితాలో చేర్చాల్సిన సమయం వచ్చేసింది. అలా చేస్తే ఈ వ్యాధిపై మరింత పరిశోధనకు నిధులు అందడంతో పాటు ప్రజారోగ్య కార్యక్రమాలు వేగవంతమవుతాయని వారు చెబుతున్నారు.
ఈ పారాసైట్ శరీరంలోకి ఎలా ఎంట్రీ ఇస్తుంది?
ఇంతకీ అసలు ఈ పరాన్నజీవి మన శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుందో కూడా తెలుసుకోవాలి. పూర్తిగా ఉడకని లేదా పరాన్నజీవితో కలుషితమైన మాంసాన్ని తినడం ఒక ప్రధాన కారణం. అలాగే పిల్లి విసర్జనలో ఉండే పరాన్నజీవి గుడ్లు మన చేతులు లేదా ఆహారం ద్వారా అనుకోకుండా శరీరంలోకి చేరినా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది.
గర్భిణికి కొత్తగా ఈ ఇన్ఫెక్షన్ సోకితే అది ప్లాసెంటా ద్వారా గర్భంలోని శిశువుకు చేరుతుంది. అలాంటి సందర్భాల్లో శిశువుకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావడమే కాదు, గర్భస్రావం జరిగే ప్రమాదం కూడా పెరుగుతుంది. అయితే ఈ వ్యాధి తప్పనిసరిగా వస్తుందనే భావన సరైంది కాదని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఎలా వ్యాపిస్తుందో ఇప్పటికే శాస్త్రవేత్తలకు స్పష్టమైన అవగాహన ఉంది. అందుకే సరైన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని చాలా వరకు నివారించవచ్చు. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక వ్యాధిని ఉష్ణమండల వ్యాధిగా గుర్తించడానికి నాలుగు ప్రధాన ప్రమాణాలను అనుసరిస్తుంది. పేద ప్రాంతాల్లో ఎక్కువగా ఉండాలి. ఉష్ణమండల, ఉప ఉష్ణమండల దేశాల్లో విస్తరించి ఉండాలి. నివారించడం, నియంత్రించడం సాధ్యమై ఉండాలి. అయినప్పటికీ పరిశోధన, ప్రభుత్వ విధానాల్లో నిర్లక్ష్యానికి గురై ఉండాలి. టోక్సో-ప్లాస్మోసిస్ ఈ నాలుగు ప్రమాణాలనూ తీరుస్తుందని పరిశోధకులు వివరించారు. ముఖ్యంగా దక్షిణ అమెరికా దేశాల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తోందని చెబుతున్నారు. అయితే ఈ వ్యాధిపై ఇంకా అనేక ప్రశ్నలకు సమాధానాలు లేవు. దీనికి ఇప్పటివరకు ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ప్రపంచవ్యాప్తంగా ఒకే విధమైన చికిత్స విధానం కూడా లేదు. ఇతర వ్యాధులతో పోలిస్తే ఈ వ్యాధిపై పరిశోధన కోసం ఖర్చు చేస్తున్న నిధులు కూడా చాలా తక్కువగా ఉన్నాయని అధ్యయనం చెబుతోంది.
మరోవైపు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది దాదాపు లక్షా 90వేల మంది శిశువులు టోక్సో-ప్లాస్మోసిస్తోనే జన్మిస్తున్నారని అంచనా. వైద్యసేవలు, పరిశుభ్రత, స్వచ్ఛమైన నీటి సౌకర్యాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో దీని ప్రభావం మరింత తీవ్రంగా కనిపిస్తోంది. అందుకే ఆహార భద్రతను మెరుగుపరచడం, స్వచ్ఛమైన తాగునీరు అందించడం, పారిశుద్ధ్య సౌకర్యాలను బలోపేతం చేయడం, గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించడం ద్వారా ఈ ప్రమాదాన్ని భారీగా తగ్గించవచ్చని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.

