Mount Everest: ఎవరెస్ట్‌పై మావన విధ్వంసం..ఈ లెక్కలు చూస్తే షాక్!

Mount Everest

Mount Everest

ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌లో రోజుకు 6వేల లీటర్లకు పైగా మూత్రం మంచుపైకి చేరుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం కింద.. మనిషి తన శరీరం నుంచి బయటకు వచ్చిన వ్యర్థాన్ని వదిలేస్తున్నాడు. వేలాది మంది ఒకే చోట గుమిగూడి ఇలా చేయడం కారణంగా ఎవరెస్ట్ ఇప్పుడు పూర్తిగా మారిపోతుంది.

పరిశోధకుల అంచనా ప్రకారం ఒక్క పర్వతారోహణ సీజన్‌లో ఈ మూత్రం వల్ల దాదాపు 154 టన్నుల మంచు కరిగే అవకాశం ఉంది. మనిషి ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవడానికి పైకి ఎక్కుతున్న కొద్దీ, తన కింద ఉన్న మంచు మాత్రం మెల్లగా కరిగిపోతోంది.

ఎత్తైన ప్రాంతాల్లో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి పర్వతారోహకులు ఎక్కువ నీరు తాగాల్సి ఉంటుంది. ఆ నీరు చివరికి మూత్రంగా బయటకు వస్తుంది. నిజానికి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ పర్వతారోహణ సీజన్‌లో దాదాపు 1,600 టెంట్లతో ఒక చిన్న పట్టణంలా మారిపోతుంది. అక్కడ వంటలు జరుగుతాయి, టెంట్లను వేడిగా ఉంచుతారు, జనరేటర్లు పనిచేస్తాయి, మనిషి తన ఇంట్లో కోరుకునే సౌకర్యాలను మంచు మధ్య కూడా సృష్టించుకుంటాడు. ఘన వ్యర్థాలను ట్యాంకుల్లో సేకరించి కొండ కిందకు తరలించే ప్రయత్నం జరుగుతున్నా, మూత్రం మాత్రం చాలా సందర్భాల్లో నేరుగా హిమానీనదం మీదకే వెళ్తుంది.

ఇక్కడే మనిషి సౌకర్యం, ప్రకృతి సహనం మధ్య ఉన్న దూరం కనిపిస్తుంది. మన శరీరం నుంచి బయటకు వచ్చిన వెచ్చని ద్రవం మంచుతో తాకినప్పుడు అక్కడి మంచుకు వేడి చేరుతుంది. వేలాది లీటర్లు ప్రతిరోజూ అదే ఉపరితలంపై పడుతూ ఉంటే, ఆ వేడి కూడా ఒక ప్రభావంగా మారుతుంది.

పరిశోధకులు లెక్కించిన 154 టన్నుల మంచు కరగడం కేవలం ఒక సంఖ్యగా కనిపించవచ్చు కానీ ఆ సంఖ్య వెనుక ఒక హిమానీనదం ఉంది. ఆ హిమానీనదం కిందకు ప్రవహించే నీటిపై ఆధారపడే లోయలు ఉన్నాయి. మంచు కేవలం తెల్లగా కనిపించే ఒక పదార్థం కాదు కదా.. అది భవిష్యత్తులో నీరుగా మారి ఎన్నో జీవనాలకు చేరాల్సిన నిల్వ. అదే సమయంలో బేస్ క్యాంప్‌లో మండుతున్న ఇంధనం మరో కథ చెబుతోంది.

2023లో అక్కడ 824 ఎల్పీజీ సిలిండర్లు, 18,935 లీటర్ల కిరోసిన్, 5,130 లీటర్ల గ్యాసోలిన్ ఉపయోగించినట్టు పరిశోధకులు గుర్తించారు. వంట చేయడానికి, టెంట్లను వేడిగా ఉంచడానికి, జనరేటర్లను నడపడానికి ఈ ఇంధనం కాలింది. ఆ కార్యకలాపాల నుంచి ఉత్పత్తైన వేడి మొత్తం దాదాపు 849,174 మెగాజౌల్స్‌గా అంచనా వేశారు. ఆ శక్తి దాదాపు 2,492 టన్నుల మంచు, మంచు కరిగిపోయేంత వేడిని సృష్టించగలదని పరిశోధకులు లెక్కించారు. అంటే మనిషి అక్కడికి చేరుకున్నప్పుడు అతనితో పాటు కేవలం తాడు, టెంట్, ఆహారం, ఆక్సిజన్ వెళ్లడం లేదు. తన సౌకర్యాల కోసం మండించాల్సిన ఇంధనం కూడా పర్వతం మీదకు వెళ్తోంది.

ఇంకా ఈ లెక్కల్లో మనిషి చేసే ప్రతి పని చేరలేదు. హెలికాప్టర్లు మనుషులను, సామగ్రిని తీసుకెళ్లడానికి చేసే రాకపోకల వల్ల వచ్చే వేడి ఇందులో లేదు. వేలాది మంది శరీరాల నుంచి వెలువడే వేడి ఇందులో లేదు.

సామగ్రిని మోసే యాక్స్ వంటి జంతువుల ఉనికి కూడా ఈ లెక్కల్లో పూర్తిగా చేరలేదు. నిజానికి మనిషి ఎవరెస్ట్‌ను జయించడానికి ఎక్కుతున్నాడు. కానీ అక్కడి మంచు మాత్రం మనిషి చేతుల్లో ఓడిపోతోంది. 154 టన్నుల మంచు మూత్రం వేడి వల్ల కరిగే అవకాశం ఉన్నా, ఇంధనం వల్ల మరో 2,492 టన్నుల మంచు కరిగేంత శక్తి విడుదలవుతున్నా, మనం ఇంకా దాన్ని ఒక సాహసయాత్రగానే చూస్తున్నాం. పర్వతాన్ని జయించడం గురించి మనం గర్వంగా మాట్లాడుతున్నాం. పర్వతం మన వల్ల ఏమి కోల్పోతోందో మాత్రం చాలా తక్కువగా మాట్లాడుతున్నాం.

ఒకరోజు ఎవరెస్ట్‌పై మంచు మరింత వెనక్కి వెళ్లినప్పుడు, అక్కడ మనిషి వేసిన అడుగుల గుర్తులు మిగలకపోవచ్చు కానీ అతను కరిగించిన మంచు తిరిగి రావడానికి వేల సంవత్సరాలు పట్టవచ్చు. మనిషి తన ప్రయాణాన్ని గంటల్లో, రోజుల్లో, ఒక సీజన్‌లో ముగించేస్తాడు. ప్రకృతి మాత్రం ఆ గాయాన్ని తరాల పాటు మోసే పరిస్థితి వస్తుంది. అదే మనిషి స్వార్థానికి అసలు ధర.