Brain Eating Amoeba: మెదడును తినేసిన జీవి.. 8ఏళ్ల చిన్నారి కథలో ఊహించని విషాదం

Brain Eating

Brain Eating

పుట్టినరోజు ముగిసిన తర్వాతి రోజే ఆ చిన్నారి జీవితం ముగిసిపోయింది. ఎనిమిదేళ్ల లిలియన్ స్మార్ట్ ఆగస్టు 22న అమెరికాలోని లూసియానాలో కన్నుమూసింది. కొద్ది రోజుల ముందు వరకు సరస్సులో ఈత కొట్టిన ఆ చిన్నారికి, తన శరీరంలోకి కనిపించని ఒక జీవి ప్రవేశించిందనే విషయం కూడా తెలియదు. ఆ జీవి పేరు నేగ్లేరియా ఫౌలెరి.

లూసియానాలోని క్లెయిబోర్న్ సరస్సులో ఈత కొట్టిన సమయంలోనే ఈ అమీబా ఆమె శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆగస్టు 15న చిన్నారిని ఆసుపత్రిలో చేర్చారు. ఆగస్టు 19న ఆరోగ్య శాఖ ఈ ఇన్ఫెక్షన్‌ను ధృవీకరించింది. కానీ అప్పటికే వ్యాధి చాలా వేగంగా ముందుకు సాగుతోంది.

నేగ్లేరియా ఫౌలెరిని సాధారణంగా బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని పిలుస్తారు. ఆ పేరు వినగానే భయంకరంగా అనిపిస్తుంది కానీ అసలు భయం దాని పేరులో లేదు. అది మన శరీరంలోకి ప్రవేశించే మార్గంలో, ఆ తర్వాత మెదడుపై చూపించే ప్రభావంలో ఉంది. ఈ సూక్ష్మజీవి సాధారణంగా వెచ్చని మంచినీటిలో కనిపిస్తుంది. సరస్సులు, చెరువులు లాంటి నీటి వనరుల్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఇది జీవించగలదు. అయితే ఆ నీటిని తాగడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ రాదు. మనిషి శరీరంలోకి వెళ్లడానికి దీనికి ఒక ప్రత్యేకమైన మార్గం అవసరం.

నీరు ముక్కులోకి బలంగా వెళ్లినప్పుడు నేగ్లేరియా ఫౌలెరి ముక్కు లోపలి భాగం నుంచి వాసనను గుర్తించే నరాల వెంట పైకి ప్రయాణించగలదు. ఆ నరాల మార్గం నేరుగా మెదడు వైపు ఉంటుంది. అక్కడికి చేరుకున్న తర్వాత ఇది ప్రైమరీ అమిబిక్ మెనింగో-ఎన్సెఫలైటిస్ అని పిలిచే తీవ్రమైన మెదడు ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. ఇది మెదడులో తీవ్రమైన వాపు మొదలవుతుంది. మెదడు కణజాలం దెబ్బతినడం ప్రారంభమవుతుంది. శరీరంలోని ఇతర భాగాల్లో కనిపించే సాధారణ ఇన్ఫెక్షన్లతో పోలిస్తే ఇది చాలా వేగంగా ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది.

మొదట కనిపించే లక్షణాలు కూడా అంత స్పష్టంగా ఉండవు. తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి వైరల్ ఇన్ఫెక్షన్‌లోనూ కనిపించవచ్చు. మెనింజైటిస్‌లోనూ కనిపించవచ్చు. అందుకే మొదటి దశలో అసలు కారణాన్ని గుర్తించడం వైద్యులకు కూడా కష్టంగా మారుతుంది.

అయితే వ్యాధి ముందుకు సాగుతున్న కొద్దీ పరిస్థితి మారుతుంది. మెడ బిగుసుకుపోవడం, గందరగోళం, భ్రాంతులు, మూర్ఛలు మొదలై చివరకు కోమా వరకు వెళ్లవచ్చు. ఈ దశకు చేరుకునే సమయానికి మెదడులో తీవ్రమైన వాపు ఇప్పటికే ఏర్పడి ఉండవచ్చు. ఇదే ఈ వ్యాధిని ఎదుర్కోవడంలో అతిపెద్ద సవాలు. ఇది చాలా అరుదుగా వస్తుంది. అమెరికాలో 1937 నుంచి 2025 వరకు కేవలం 173 కేసులు నమోదయ్యాయని సీడీసీ డేటా చెబుతోంది. అందులో ప్రాణాలతో బయటపడింది కేవలం నలుగురే.

అంటే నమోదైన కేసుల్లో మరణాల రేటు దాదాపు 97 శాతంగా ఉంది. ఇంత అరుదైన వ్యాధి కావడంతోనే దీనికి ఒకే ఒక నిర్ధారిత చికిత్స కూడా లేదు. పెద్ద సంఖ్యలో రోగులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి ఒక ప్రామాణిక చికిత్సను నిర్ధారించే అవకాశం వైద్య శాస్త్రానికి ఇప్పటివరకు రాలేదు. అందుకే వైద్యులు కొన్ని సందర్భాల్లో పలు యాంటీమైక్రోబయల్, యాంటీ ఫంగల్ మందులను కలిపి ఉపయోగిస్తున్నారు.

వాటిలో యాంఫోటెరిసిన్-బి, మిల్టెఫోసిన్ లాంటి మందులు ఉన్నాయి. వీటితో పాటు మెదడుపై ప్రభావాన్ని నియంత్రించేందుకు సహాయక చికిత్స అవసరమవుతుంది. అయినా ఫలితాలు చాలా పరిమితంగానే ఉన్నాయి. అందుకే ఈ వ్యాధి అంటే అందరికి భయం..మరి చూడాలి ఈ బ్రెయిన్‌ ఈటింగ్ అమీబా ఇంకెంతమందిని పొట్టనబెట్టుకుంటుందో మరి.