‘Thara’ Mantra: సైబర్ దొంగల వేటలో ‘టాలీవుడ్ తారలు’.. వైజాగ్ పోలీసుల ‘తార’ మంత్రం మామూలుగా లేదుగా!

  • వందల కోట్లు కోల్పోతున్న బాధితులు
  • నిరుద్యోగుల ఆశలు, గృహిణుల అవసరాలు
  • యువత బలహీనతలను అవకాశంగా మార్చుకుంటున్న సైబర్ ఫ్రాడ్స్
' Thara' Mantra

' Thara' Mantra

‘Thara’ Mantra: ఒకటి కాదు రెండు సుమారు 24 రకాల గేలాలు.. ఈ గేలాలకు ఉండే ఎరలకు వేలాది మంది ప్రజలు చిక్కుతూ.. కోట్లాది రూపాయల సొమ్ము పోగోట్టుకుంటున్నారు. తెలిసీ తెలియక కొందరు… తెలిసీ కూడా మరీ కొందరు… ఈ ఉచ్చులో పడి బలి అయిపోతున్నారు. ఓ వైపు ఆఫ్ లైన్ దొంగతనాలు కలవరపెడుతుంటే.. వాటికి చెక్ పెడుతున్న పోలీసులకు ఇప్పుడు మరో పెద్ద టాస్క్ ఎదురైంది. అవే ఆన్‌లైన్ సైబర్ నేరాలు. కూర్చున్న చోట నుంచే కోట్లు కొల్లగొట్టే మాఫియా అది. ఈ సైబర్ నేరాల బారి నుంచి ఎంత కాపాడదామన్నా… ఎక్కడో ఓ చోట ఆ సైబర్ వలకు చిక్కిపోతూ లబోదిబోమంటున్నారు బాధితులు. అందుకే ఈ 24 గేలాలకు.. 24 క్రాఫ్ట్‌తోనే అవగాహన కల్పించాలని విశాఖ పోలీసులు సంకల్పించారు. ఇంతకీ విశాఖ పోలీసులు.. కనిపెట్టిన ఆ ‘తార’క మంత్రమేంటి?

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా కాపాడేందుకు పోలీసులు ఓ సరికొత్త మంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. అదే తారక మంత్రం. సినీ తారలచే ప్రచారం చేయించి ప్రజల్లో అవగాహన కల్పించి సైబర్ నేరగాళ్ల వలలకు చిక్కకుండా ప్రయత్నం చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి విశాఖపై సైబర్ నేరగాళ్లు డేగ కన్నుతో చూస్తున్నారు. దేశంలోనే అత్యధిక సైబర్ నేరాలు జరుగుతున్న నగరాల్లో విశాఖ ఒకటి. ఏటా వందల కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్లు కాజేస్తున్నట్లు గణంకాలు చెపుతున్నాయి. నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్ధులు, రిటైర్ అయిన వారు.. ఇంటి వద్ద ఖాళీగా ఉండే మహిళలు, గృహిణులు, వృద్దులు.. ఇలా ఏ ఒక్క కేటగిరినీ వదలకుండా అందినకాడికి అందినట్లు దోచేస్తున్నారు సైబర్ వేటగాళ్లు.

×
×
Ad

దేశంలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ. వందల కోట్లు కోల్పోతున్న బాధితులు ఎక్కువ మంది విశాఖ వాసులేనని పోలీసుల నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీరిలోనూ విద్యావంతులే చాలా మంది ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పుడు ప్రతీ ఒక్కరికి స్మార్ట్ ఫోన్, ఆన్‌లైన్ ట్రాన్‌శాక్షన్స్ సుపరిచయమే. అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ప్రపంచమే మనతో పాటుగా ఉన్నట్లు ఉంటుంది. అయితే వాటితో పాటు సైబర్ నేరగాళ్లను మనం అంటిపెట్టుకున్నట్టే లెక్క. నిరుద్యోగుల ఆశలు, గృహిణుల అవసరాలు, యువత బలహీనతలను అవకాశంగా మార్చుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. వృద్ధులు, యువత లక్ష్యంగా రోజుకొక కొత్త ఉచ్చు వేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. బ్యాంకు ఖాతాల నుంచి నేరుగా నగదు కొట్టేస్తే పోలీసులకు దొరికిపోతామనే భయంతో ఏకంగా క్రిప్టో కరెన్సీ వాలెట్లకు నిధులు మళ్లించుకునే స్థాయికి వీరి సాంకేతికత పెరిగిపోయింది. ఈ-కామర్స్ మోసాలు, ఫేక్‌లోన్ యాప్‌లతో సామాన్యుల ఖాతాలను కొల్లగొట్టేస్తున్నారు. ఈ మాయాజాలం నుంచి ప్రజలను కాపాడేందుకు పోలీసులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

విశాఖ పోలీసుల చొరవతో టాలీవుడ్ తారలతో ఇప్పటి వరకు సుమారు 14 షార్ట్ ఫిల్మ్స్ రూపొందించారు. ఇందులో వివిధ కాన్సెప్ట్‌లు ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు విశాఖ పోలీసులు. ఎక్కడికక్కడ హోర్డింగ్స్ పెట్టి ఇంకా ప్రజల్లో విస్తృత ప్రచారం చేయించాలని భావిస్తున్నారు. దీనికి తారలు అండగా నిలుస్తున్నారు. నటీనటులు, దర్శకులు, క్రీడాకారులతో రాష్ట్ర స్థాయిలో పోలీసులు ఈ షార్ట్ ఫిల్మ్స్ రూపొందించారు. వాటి ద్వారా యూట్యూబ్, సామాజిక మాద్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

ఆన్‌లైన్‌లో తక్కువ ధరకు వాహనాలంటూ ఆశపడితే ఎలా మోసపోతారో హీరో అక్కినేని నాగచైతన్య, ప్రిన్స్, గాయత్రి భార్గవి, అశోకుమార్, రఘు కారుమంచి తదితరులు తమదైన శైలిలో వివరించారు. పార్ట్ టైమ్ జాబ్ మోసాలను తెలియజేస్తూ నటుడు రాజేంద్రప్రసాద్ అద్భుతమైన వీడియో రూపొందించారు. హనీ ట్రాప్ మోసంపై పి.వి.సింధు, డాక్టర్ భరత్ రెడ్డి, హరితేజ, మాళవిక తదితరులతో వీడియో విడుదలైంది. బ్యాంకు ఖాతాలకు సంబంధించిన యూపీఐ పిన్ మోసాల గురించి నటుడు శివబాలాజీ హెచ్చరించే వీడియో రూపొందించారు. కస్టమర్ కేర్ సెర్చ్ మోసంపై హీరో సుధీర్ బాబు, అజయ్ ఘోష్, శ్రీవాణిలతో వీడియో రూపొందించారు.

ఈ కామర్స్, ఆన్‌లైన్ షాపింగ్ ఆఫర్ల పేరుతో జరుగుతున్న మోసాలపై హీరో ఆది సాయికుమార్, నటుడు బ్రహ్మాజీ, సినీ దర్శకుడు అనిల్ రావిపూడి, నటి రాశీసింగ్‌తో వినూత్నంగా రూపొందించిన వీడియో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇన్‌స్టంట్ రుణ యాప్ పేరుతో జరిగే మోసాలను తెలియజేస్తూ హీరో అఖిల్ అక్కినేని చేసిన వీడియోకు స్పందన వచ్చింది. నార్కోటిక్స్, కస్టమ్స్, పోలీసుల పేరుతో ఫేక్ వీడియో కాల్స్ చేసి భయపెట్టి దోచుకునే మోసాలపై నటీనటులు రాజీవ్ కనకాల, పాయల్ రాజ్‌పుత్‌తో ఆసక్తికర వీడియో చేసి ఇటీవల విడుదల చేశారు. ఇలా పలువురు తారల చొరవతో పోలీసులు అవగాహన కల్పించేందుకు ఈ మంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు సాంకేతికను వాడుకుని కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు పోలీస్ కమీషనర్ శంఖబ్రత బాగ్చి. బ్యాంకు ఖాతాల ద్వారా అయితే చిక్కుతామనే భయంతో ఇప్పుడు అనామకంగా ఉండే క్రిప్టో వాలెట్ల ద్వారా అక్రమ బదిలీలు చేయించుకుంటున్నారు. ఒకసారి క్రిప్టోలోకి నగదు మారాక రికవరీ చేయడం సాంకేతికంగా అత్యంత కఠినమైన సవాలు. అందుకే ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీపీ.