Rajasthan: మసీదు సమీపంలో రోడ్డు ప్రమాదం, మూకదాడిలో ఒకరు మృతి.. మత ఉద్రిక్తత..

  • చిన్న వివాదం కారణంగా ఒక వ్యక్తి హత్య..
  • రాజస్థాన్ రాష్ట్రంలో ఘటన..
  • మసీదు సమీపంలో తోపుడు బండిని ఢీకొట్టిన కారు..
  • మూకదాడిలో సీతారాం కీర్ అనే వ్యక్తి మృతి..
Rahasthan Incident

Rahasthan Incident

Rajasthan: రాజస్థాన్ బిల్వారా జిల్లాలోని జహాజ్‌పూర్‌లో శుక్రవారం సాయంత్రం చిన్న రోడ్డు ప్రమాదం, 25 ఏళ్ల వ్యక్తిని కొట్టి చంపడానికి కారణమైంది. టోంక్ కంటోన్మెంట్ ప్రాంతం నుంచి నలుగురు యువకులు కారులో ప్రయాణిస్తుండగా, జహాజ్‌పూర్ ప్రాంతంలోని ఒక మసీదు వద్ద తోపుడు బండిని కారు ఢీ కొట్టింది. సదరు యువకులు సోదరి ఇంట్లో జరిగిన కార్యక్రమానికి హాజరు కావడానికి వచ్చారు. అయితే, ఈ ఘటనపై స్థానికంగా ఉన్న గుంపు కోపంతో 25 ఏళ్ల సీతారాం కీర్ అనే వ్యక్తిపై దారుణంగా దాడి చేసి చంపారు.

నష్టపరిహారం చెల్లిస్తానని చెబుతున్నా వినకుండా, సుమారు 20 మంది వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం. సీతారాం కీర్ అనే వ్యక్తిని కారులో నుంచి లాగి రోడ్డుపై పడేసి, ఆ గుంపు దారుణంగా కొట్టింది. పదేపదే క్షమాపణలు చెప్పినప్పటికీ, నష్టానికి పరిహారం చెల్లిస్తానని చెప్పినప్పటికీ వినకుండా దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాడి సమయంలో కారు వైరింగ్ కత్తిరించారు. తీవ్రంగా గాయపడిన సీతారాంను స్థానిక ఆస్పత్రికి బైక్‌పై తీసుకెళ్లారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఆతర్వాత ఆయనతో ఉన్న ముగ్గురు సహచరులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Read Also: Rising Fear of Marriage: భర్తలను చంపుతున్న భార్యలు.. ఇంత కృరంగా ఎందుకు మారుతున్నారు?

అయితే, ఈ సంఘటనలో నిందితులు ముస్లిం వర్గానికి చెందడంతో ఈ ఘటన మత ఉద్రిక్తతతకు కారణమైంది. నిరసనగా స్థానిక నివాసితులు శనివారం పట్టణం బంద్‌కు పిలుపునిచ్చారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి బాధిత కుటుంబ ప్రభుత్వం ఆస్పత్రి ముందు ధర్నాకు దిగింది. స్థానిక ఎమ్మెల్యే గోపీచంద్ మీనా బాధితులతో చర్చలు జరిపారు.

ఈ కేసులో 36 మందిపై హత్య కేసు నమోదు చేశారు. వీరిలో 16 మందిని గుర్తించారు, మరో 20 మందిని గుర్తించలేదు. ప్రధాన నిందితుడు చంద్ మొహమ్మద్ కుమారుడు, తోపుడుబండి యజమాని అయిన షరీఫ్‌ని శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉద్రిక్తత పెరగడంతో, జహాన్‌పూర్‌లో 10 పొరుగు పోలీస్ స్టేషన్ల నుంచి బలగాళను మోహరించారు. శనివారం పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ, నిరసన, మృతుల కుటుంబాలకు సంఘీభావంగా మార్కెట్ మూసేశారు.