ఏలూరులో అదృశ్యమైన మహిళ కథ విషాదాంతమైంది. పోలవరం కాలువ ప్రాంతంలో శవంగా తేలింది. ఇంతకూ ఆ చనిపోయిన మహిళ ఎవరు? ఆమెను ఎవరు చంపారు? ఎందుకోసం హత్య చేశారు? వివాహేతర బంధమే హత్యకు దారి తీసిందా? ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా? పోలీసులు ఏం చెబుతున్నారు?
మహిళ పేరు మల్లవల్లి విశాలి. ఏలూరు త్రీటౌన్ పరిధిలోని సౌరిపురం గ్రామంలో నివాసం ఉంటోంది. ఏప్రిల్ 18న గుడివాడలోని బంధువుల ఇంటికి వెళ్తున్నానని ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లింది. అయితే తిరిగి ఇంటికి రాలేదు. దీంతో పాటు ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె భర్తతో సహా కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మహిళ మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా.. పోలీసులు విశాలి కాల్ డేటా, మొబైల్ లొకేషన్ తదితర సాంకేతిక ఆధారాలను పరిశీలించారు. విచారణలో అదే గ్రామానికి చెందిన పాల వ్యాపారి దర్శన్ ఫ్రాన్సిస్ శౌరితో ఆమె తరచూ మాట్లాడుతున్నట్లు గుర్తించారు. అదే సమయంలో ఫ్రాన్సిస్ కూడా గ్రామంలో కనిపించకపోవడంతో పోలీసులు అతనిపై అనుమానం వ్యక్తం చేశారు.
ఫ్రాన్సిస్ మృతురాలి కుటుంబానికి 2 లక్షలు అప్పుగా ఇచ్చి వడ్డీ వసూలు చేస్తున్నాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది. అయితే విశాలి ఇతరులతో కూడా ఫోన్లో మాట్లాడుతుందనే అనుమానం పెంచుకున్న ఫ్రాన్సిస్.. ఆమెను హత్య చేయాలని పథకం రచించాడు. ఏప్రిల్ 18న డబ్బులు ఇస్తానని నమ్మించి విశాలిని హనుమాన్ జంక్షన్కు పిలిపించాడు. అక్కడి నుంచి బైక్పై నూజివీడు మండలం పల్లెర్లమూడి సమీపంలోని పోలవరం కాలువ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ చున్నీతో గొంతు బిగించి హత్య చేసిన అనంతరం పెద్ద రాయితో ఛాతిపై బలంగా కొట్టి ప్రాణాలు తీశాడు. అనంతరం శవాన్ని పొదల్లో పడేశాడు.
ఇక ఈ మర్డర్ కేసులో తాను దొరకకుండా దృశ్యం సినిమా తరహాలో స్కెచ్చేశాడు ఫ్రాన్సిస్. హత్య జరిగిన 5 రోజుల తర్వాత మళ్లీ ఘటనాస్థలానికి వెళ్లిన నిందితుడు శవాన్ని లోతైన గుంతలో పూడ్చిపెట్టాడు. మృతురాలి బట్టలు, వస్తువులను కాల్చివేసి ఆధారాలు నాశనం చేశాడు. ఇంతటితో ఆగకుండా.. ఆమె బతికే ఉందనే భావన కలిగించేందుకు మృతురాలి ఫోన్ నుంచి భర్తకు వాట్సాప్ సందేశాలు పంపడం, కాల్స్ లిఫ్ట్ చేసి మాట్లాడకుండా ఉండటం వంటి ప్రయత్నాలు చేశాడు. చివరికి ఫోన్ను పగులగొట్టి చెరువులో పడేశాడు. అప్పటికే నిందితుడి కదలికలపై నిలబెట్టిన పోలీసులు మే 28న హౌసింగ్ బోర్డ్ కాలనీ సమీపంలో నిందితుడు ఫ్రాన్సిస్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు నేరాన్ని అంగీకరించాడు. అతడు చూపించిన ప్రదేశంలో నూజివీడు తహసీల్దార్ సమక్షంలో పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం అక్కడే పోస్ట్మార్టం పూర్తి చేశారు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
