Pak ISI: తప్పిన పెను ప్రమాదం.. పాకిస్తాన్ ISI ఉగ్రవాద ముఠాను పట్టుకున్న పోలీసులు..

Delhi

Delhi

పాకిస్తాన్‌కు చెందిన ఇంటర్‌-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)తో నేరుగా సంబంధాలు ఉన్న ఒక అంతర్జాతీయ ఉగ్రవాద-నేర ముఠాను ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ విభాగం విజయవంతంగా బట్టబయలు చేసింది. పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న గ్యాంగ్‌స్టర్ కమ్ ఉగ్రవాది షాజాద్ భట్టి, అతని అనుచరుడు అజ్మల్ గుజ్జర్‌కు చెందిన ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సరైన సమయంలో పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించడం వల్ల ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో జరగాల్సిన భారీ ఉగ్రవాద దాడులు, ఆయుధాల సరఫరా, మరియు డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా కుట్రలు భగ్నమయ్యాయి. పాకిస్తాన్ నుంచి వచ్చే ఆదేశాల ప్రకారమే ఈ ముఠా పనిచేస్తోందని, పంజాబ్ సరిహద్దుల ద్వారా పాకిస్తాన్ నుండి డ్రోన్ల సహాయంతో ఆయుధాలు, మందుగుండు సాగ్రి, మరియు హెరాయిన్ వంటి ప్రమాదకరమైన డ్రగ్స్‌ను భారతదేశంలోకి స్మగ్లింగ్ చేసి, వాటిని ఢిల్లీ-NCR పరిధిలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది.

ఈ ముఠా సభ్యులు ఢిల్లీ పరిధిలోని రద్దీగా ఉండే ప్రజా ప్రాంతాలు, ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు, అలాగే కొంతమంది ప్రముఖ మత పెద్దల ప్రాంతాలలో రెక్కీ నిర్వహించి, ఆయా ప్రాంతాలను ఫోటోలు, వీడియోలు తీసి పాకిస్తాన్‌లోని తమ హ్యాండ్లర్లకు పంపించారు. సమాజంలో భయాందోళనలు సృష్టించడం, మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం ద్వారా దేశంలో అలజడి రేపడమే ఈ ముఠా ముఖ్య ఉద్దేశమని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఘజియాబాద్‌కు చెందిన అనాస్ అలియాస్ అనాస్ త్యాగి, మోహిత్ అలియాస్ యోగి, 23 పాత కేసులు ఉన్న దీపక్ అలియాస్ దీపక్ అగ్రోలా, ఆరిఫ్ అలియాస్ ప్రధాన్, సాబిర్, జతన్ మరియు పంజాబ్‌కు చెందిన కరణ్‌వీర్ సింగ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి ఐదు అత్యాధునిక సెమీ ఆటోమేటిక్ పిస్టల్స్, 41 బుల్లెట్లు, పాకిస్తాన్ ఉగ్రవాదులతో మాట్లాడిన చాట్స్ మరియు వాయిస్ నోట్స్ ఉన్న 7 మొబైల్ ఫోన్లు, ఒక స్కార్పియో కారు , ఆయుధాలు-డ్రగ్స్ అమ్మగా వచ్చిన డబ్బును దాచిన పలు బ్యాంకు ఖాతాల వివరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

×
×
Ad

పాకిస్తాన్‌లోని షాజాద్ భట్టి, అజ్మల్ గుజ్జర్‌లు సోషల్ మీడియా మరియు రహస్య మెసేజింగ్ యాప్‌ల ద్వారా భారతీయ యువతను గుర్తించి, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ఆశ చూపి తమ ముఠాలోకి లాగుతున్నారు. 2026 మే నెలలో ఈ ముఠా ఢిల్లీలో దాడికి ప్లాన్ చేస్తోందన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి, మొదట మోహిత్‌ను యమునా విహార్ వద్ద పట్టుకున్నారు. అతని ఫోన్ పరిశీలించగా పాకిస్తాన్ లింకులు బయటపడ్డాయి. ఈ ముఠాలోని ఆరిఫ్ అనే నిందితుడు పాకిస్తాన్‌కు చెందిన అజ్మల్ గుజ్జర్ నుండి సుమారు ఒక లక్ష రూపాయలు యూపీఐ (UPI) ద్వారా చెల్లించి ‘జిగానా పిస్టల్’ కొనుగోలు చేశాడని, ఆ తర్వాత వీరు హెరాయిన్, చిట్టా వంటి డ్రగ్స్ స్మగ్లింగ్‌లోకి దిగారని తెలిసింది. అలాగే గ్యాంగ్‌స్టర్ దీపక్ అగ్రోలా జైలులో ఉంటూనే మొబైల్ ఫోన్ ఉపయోగించి, అనాస్ ద్వారా అజ్మల్ గుజ్జర్‌ను సంప్రదించి ఆయుధాల రవాణాకు సహాయం చేసినట్లు తేలింది. ఈ నెట్‌వర్క్‌లో పరారీలో ఉన్న మిగిలిన నిందితులు, డ్రగ్స్ వ్యాపారుల కోసం ఢిల్లీ పోలీసులు గాలిస్తున్నారు.