ఉబర్, రాపిడో… భారత రవాణా రంగంలో ఊపు తెచ్చిన రెండు ప్రముఖ రైడ్ హెయిలింగ్ దిగ్గజాలు. ఈ రెండూ ఒకటైపోతున్నాయా? విలీనానికి బాటలు పడుతున్నాయా? ఇందులో నిజమెంత..? తాజాగా ఉబర్ సీఈఓ భారత పర్యటన సందర్భంగా రాపిడో యాజమాన్యంతో విలీనంపై రహస్య చర్చలు జరిపినట్లు వార్తలు వెలువడటంతో రవాణా రంగంలో ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే వ్యాపార నియంత్రణ, హక్కుల విషయంలో ఇరు సంస్థల మధ్య వ్యూహాత్మక అభిప్రాయ భేదాలు రావడంతో ఈ మెగా డీల్కు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. అసలు ఆ చర్చల్లో ఏం జరిగింది? డీల్ ఎందుకు క్యాన్సిల్ అయిందో వివరంగా తెలుసుకుందాం..
అమెరికన్ రైడ్ హెయిలింగ్ దిగ్గజం ఉబర్, భారతీయ స్టార్టప్ రాపిడోల మధ్య దేశీయ విలీనం కోసం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ ఏడాది మే నెలలో ఉబర్ సిఈఓ దారా ఖోస్రోషాహి ఐదు రోజుల భారత్ పర్యటనకు వచ్చినప్పుడు ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. భారత మార్కెట్లో విస్తరిస్తున్న తీవ్ర పోటీ, నగదు వ్యయాన్ని తగ్గించుకోవడం, వ్యాపారాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా రెండు సంస్థల ఉన్నతాధికారులు విస్తృత చర్చలు జరిపారు. ఉబర్ సంస్థ తమ వ్యాపారాన్ని రాపిడోతో విలీనం చేసి, నిర్వహణ బాధ్యతలను రాపిడో యాజమాన్యానికి అప్పగించాలని భావించింది.
అయితే, రాపిడో దీనికి భిన్నమైన ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. క్యాష్ అండ్ స్టాక్ లావాదేవీల రూపంలో ఉబర్ భారత వ్యాపారాన్ని పూర్తిగా తామే కొనుగోలు చేస్తామని, ఉబర్కు రాపిడోలో మైనారిటీ వాటా ఇస్తామని ప్రతిపాదించింది. కానీ, వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన భారత మార్కెట్పై నియంత్రణను పూర్తిగా వదులుకోవడానికి ఉబర్ ఏమాత్రం సిద్ధపడలేదు. 2020లో ఉబర్ ఈట్స్ వ్యాపారాన్ని జొమాటోకు విక్రయించినప్పటికీ, ప్రధాన రైడ్ హెయిలింగ్ విభాగంలో తన ఉనికిని కోల్పోవడం ఉబర్కు ఇష్టం లేదు. యాజమాన్య హక్కుల విషయంలో ఇరు సంస్థల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ డీల్ ప్రాథమిక దశలోనే నిలిచిపోయింది.
ప్రస్తుతం భారత్లో రాపిడో బైక్ టాక్సీ విభాగంలో ఆధిపత్యంతో మొత్తం రైడ్ మార్కెట్లో 50 శాతం వాటాను కలిగి ఉండగా, ఉబర్ ఫోర్ వీలర్ క్యాబ్ విభాగంలో 40-45 శాతం వాటాతో బలంగా ఉంది. ఒకవేళ ఈ విలీనం జరిగి ఉంటే భారత రవాణా రంగంలో ఓలా తప్ప మరో పెద్ద పోటీదారు ఉండేవాడు కాదు. ఇది మార్కెట్ పోటీపై ప్రభావం చూపే అవకాశం ఉండేది. కాగా, ఈ విలీన వార్తలను రాపిడో ఖండించగా, ప్రస్తుతం ఈ రెండు కంపెనీలు స్వతంత్రంగానే తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. రాపిడోకు పోటీగా ఉబర్ కూడా ఇటీవల తన బైక్ టాక్సీ సేవలను దాదాపు 220 నగరాలకు పెంచి, కొత్త సవాళ్లకు సిద్ధమవుతోంది.

