SEBI F&O New Rules: దేశీయ స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) ట్రేడింగ్ చేసే వారికి మరింత ఊరటనిచ్చేలా మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ (SEBI) ఒక కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. మార్కెట్లో అకస్మాత్తుగా వచ్చే భారీ హెచ్చుతగ్గుల (Volatility) సమయంలో ట్రేడర్లు సరైన ‘స్ట్రైక్ ప్రైస్’ ఎంచుకోవడానికి పడే ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా సెబీ ఈ కొత్త ముసాయిదాను సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదన ప్రకారం.. మార్కెట్ కదలికలకు అనుగుణంగా లైవ్ ట్రేడింగ్ జరుగుతున్నప్పుడే కొత్త స్ట్రైక్ ప్రైస్లను జోడించే లేదా తొలగించే స్వేచ్ఛను స్టాక్ ఎక్స్ఛేంజీలకు (NSE, BSE) కల్పించనున్నారు.
అసలు సమస్య ఇదే
సాధారణంగా ట్రేడర్లు మార్కెట్ ట్రెండ్ను బట్టి తమ పెట్టుబడులకు రక్షణగా లేదా లాభాల కోసం ఒక నిర్దిష్ట స్ట్రైక్ ప్రైస్ను ఎంచుకుంటారు. అయితే, మార్కెట్లో ఏదైనా పెద్ద వార్త వచ్చినప్పుడు ఇండెక్స్ లేదా షేర్ల ధరలు అకస్మాత్తుగా భారీగా పెరగడం లేదా పడిపోవడం జరుగుతుంది. ఉదాహరణకు నిఫ్టీ 25,000 పాయింట్ల వద్ద ఉన్నప్పుడు ట్రేడర్లకు 24,900 నుంచి 25,100 వరకు స్ట్రైక్ ప్రైస్లు అందుబాటులో ఉంటాయి. కానీ ఏదైనా సంచలన వార్త వల్ల నిఫ్టీ ఒకేసారి 25,700 మార్కుకు చేరితే.. అక్కడ తగినన్ని కొత్త స్ట్రైక్ ప్రైస్లు అందుబాటులో ఉండవు. దీనివల్ల ట్రేడర్లు తమ వ్యూహాలకు తగ్గట్టుగా ఆప్షన్ కాంట్రాక్ట్లను ఎంచుకోలేక నష్టపోతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకే సెబీ ఈ కొత్త డ్రాఫ్ట్ను రెడీ చేసింది.
లైవ్ మార్కెట్లోనే కొత్త కాంట్రాక్ట్ల ఎంట్రీ
ఈ కొత్త రూల్ అమల్లోకి వస్తే, లైవ్ మార్కెట్ నడుస్తున్నప్పుడే ఎక్స్ఛేంజీలు కొత్త స్ట్రైక్ ప్రైస్లను యాడ్ చేయవచ్చు. మార్కెట్ ధరలకు అనుగుణంగా ఇన్-ద-మనీ (ITM), అవుట్-ఆఫ్-ద-మనీ (OTM) స్ట్రైక్ ప్రైస్లు తగినన్ని అందుబాటులో ఉండేలా ఎక్స్ఛేంజీలు ప్రతిరోజూ సమీక్షించాలి. మార్కెట్ ధరకు చాలా దూరంగా ఉండి, ట్రేడర్లు అస్సలు ఉపయోగించని పాత స్ట్రైక్ ప్రైస్లను సిస్టమ్ నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటారు. లైవ్ మార్కెట్లో కొత్త కాంట్రాక్ట్లు యాడ్ చేయడం వల్ల బ్రోకింగ్ కంపెనీల (Groww, Zerodha వంటివి) టెక్నికల్ సిస్టమ్స్ లేదా యాప్స్పై ఎలాంటి అదనపు ఒత్తిడి పడకుండా, ట్రేడింగ్కు ఎటువంటి అంతరాయం కలగకుండా ఈ ప్రక్రియను డిజైన్ చేయాలని సెబీ స్పష్టం చేసింది.
ఎక్స్ఛేంజీలకు పూర్తి స్వేచ్ఛ.. జూన్ 15 వరకు గడువు
ఈ కొత్త విధానంలో ప్రాథమిక నియమాలు మార్కెట్ మొత్తానికి ఒకేలా ఉన్నప్పటికీ, రెండు స్ట్రైక్ ప్రైస్ల మధ్య ఎంత గ్యాప్ ఉంచాలనేది నిర్ణయించుకునే పూర్తి పారదర్శకమైన హక్కును ఎక్స్ఛేంజీలకే వదిలేశారు. అలాగే ఈ నియమాలను ఎక్స్ఛేంజీలు తమ వెబ్సైట్లలో స్పష్టంగా ఉంచాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనపై ఇన్వెస్టర్లు, బ్రోకర్లు, మార్కెట్ నిపుణుల అభిప్రాయాలను సెబీ కోరింది. సాధారణ ఇన్వెస్టర్లు సైతం ఈ ముసాయిదాపై తమ సూచనలను, సలహాలను 2026 జూన్ 15 లోపు సెబీకి పంపించవచ్చు. దీనిపై వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈ నిబంధనను అధికారికంగా అమలు చేయనున్నారు.
