NTV Telugu Site icon

Reliance Jio: జియోకు భారీ షాక్‌..! యూజర్లు ఎంత పనిచేశారంటే..?

అన్నీ ఫ్రీ అంటూ టెలికాం రంగంలో అడుగుపెట్టిన రిలయన్స్‌ జియో.. తక్కువ కాలంలోనూ కోట్లాది మంది మనసులను కొల్లకొట్టింది.. ఫ్రీ స్కీమ్‌ ఎత్తివేసి.. టారిప్‌ ప్లాన్లు తీసుకొచ్చినా.. క్రమంగా ఆ సంస్థ యూజర్ల సంఖ్య పెరుగుతూ పోయింది.. దీంతో.. దేశంలోనే అగ్రగామి టెలికం సంస్థగా అవతరించింది.. అయితే, ఇప్పుడు ఆ సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.. 2021 డిసెంబర్ నెలలో మొబైల్ యూజర్లు గణనీయంగా జియోకు గుడ్‌బై చెప్పేశారు.. ఏకంగా 20 శాతం మేర ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది జియో.. ఇదే, ఆ సంస్థను యూజర్లు వీడడానికి కారణంగా తెలుస్తోంది.. ఆయా యూజర్లు ఇతర టెలికం సంస్థల నెట్‌ వర్క్స్‌ను ఎంచుకున్నారు.. ఇక, జియోతో పాటుగా వొడాఫోన్ ఐడియాకు కూడా ఎదురుదెబ్బ తగిలినట్టు ట్రాయ్ డేటా చెబుతోంది.

Read Also: Harish Rao: కేసీఆర్‌ కారణజన్ముడు.. తెలంగాణ ఆదర్శంగా నిలిచింది

డిసెంబర్ 2021లో దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారుల సంఖ్య ఏకంగా 1.28 కోట్లు తగ్గిందని ట్రాయ్ వెల్లడించింది. ఇక, అగ్రగామి టెలికం సంస్థ అయిన రిలయన్స్ జియో దాదాపు 1.29 కోట్ల వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయినట్టు పేర్కొంది.. డిసెంబర్ 2021లో దాని మొబైల్ సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య 41.57 కోట్లకు పడిపోయిందని పేర్కొంది.. ఇదే సమయంలో.. వోడాఫోన్ ఐడియా 16.14 లక్షల మంది మొబైల్ సబ్‌స్క్రైబర్‌లను కోల్పోగా, డిసెంబర్ 2021లో దాని బేస్ 26.55 కోట్లకు చేరినట్టుగా తెలిపింది.. అయితే, జియో, వొడాఫోన్‌ ఐడియా పరిస్థితి ఇలా ఉంటే.. మరో టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్‌ మాత్రం ఫుల్‌ జోష్‌లోకి వచ్చింది.. ఈ సమయంలో ఎయిర్‌టెల్ 4.75 లక్షల మంది కొత్త యూజర్లను పొంది.. తన వినియోగదారుల సంఖ్యను 35.57 కోట్లకు పెంచుకుంది భారతీ ఎయిర్‌టెల్‌… మొత్తంగా ఒకప్పుడు జియో అంటే ఎగబడిన జనం.. ఇప్పుడు క్రమంగా జియో నెట్‌వర్క్‌ను వీడడం ఆ సంస్థకు ఊహించలేని దెబ్బగా మారిపోయింది.