భారతీయ రైల్వేలో సరుకు రవాణాను మరింత వేగవంతం చేసే దిశగా కీలక అడుగు పడింది. దేశంలోనే తొలిసారిగా రూపొందించిన వందే భారత్ ఫ్రైట్ EMU ప్రయోగాత్మక పరుగులు ప్రారంభించింది. పశ్చిమ మధ్య రైల్వే (WCR) పరిధిలోని కోటా డివిజన్లో ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. పరీక్షల సమయంలో ఈ రైలు గంటకు 145 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంది. సరుకు రవాణా, పార్శిల్ సేవలు, ఈ-కామర్స్ లాజిస్టిక్స్, కోల్డ్-చైన్ రవాణాను వేగవంతం చేయడం ఈ కొత్త రైలు ప్రధాన లక్ష్యం. భారతీయ రైల్వే సరుకు రవాణా వ్యవస్థను మరింత ఆధునికంగా, సమర్థవంతంగా మార్చడంలో ఇది కీలక పాత్ర పోషించనుందని అధికారులు భావిస్తున్నారు.
నెల రోజుల పాటు ట్రయల్స్
రైల్వే శాఖ ఈ వందే భారత్ ఫ్రైట్ రైలుకు సుమారు నెల రోజుల ట్రయల్ కార్యక్రమాన్ని రూపొందించింది. నాగ్దా-కోటా-సవాయి మాధోపూర్ రైల్వే మార్గంలో వివిధ వేగాలు, లోడ్ పరిస్థితులు, నిర్వహణ పరిస్థితుల్లో రైలును పరీక్షిస్తున్నారు. కోటా డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సౌరభ్ జైన్ ప్రకారం, ఇది దేశంలోనే మొట్టమొదటి 16-కోచ్ వందే భారత్ ప్లాట్ఫామ్ ఆధారిత ఫ్రైట్ EMU ప్రోటోటైప్ రేక్. ఈ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో తయారు చేశారు. భారతీయ రైల్వేలో పార్శిల్, లాజిస్టిక్స్ సేవలను వేగవంతంగా, సమయపాలనతో, ఆధునికంగా మార్చాలనే లక్ష్యంతో దీనిని అభివృద్ధి చేశారు.
ట్రయల్స్లో ఏం పరీక్షిస్తున్నారు?
ఈ ప్రయోగాత్మక పరుగుల్లో రైలు పనితీరు, భద్రత, వేగం తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా:
గంటకు 120, 130, 140, 145 కి.మీ. వేగాల్లో పరీక్షలు
లోడ్తో, లోడ్ లేకుండా ఆసిలేషన్ పరీక్షలు
అత్యవసర బ్రేకింగ్ డిస్టెన్స్ (EBD)
కోచ్ల మధ్య కప్లర్ ఫోర్స్ పరీక్ష
వక్ర మార్గాల్లో రైలు పనితీరు
ట్రాక్షన్, బ్రేకింగ్, జర్క్ పరీక్షలు
రీజెనరేటివ్ ఎనర్జీ సిస్టమ్ పనితీరు
PAPIS వ్యవస్థకు సంబంధించిన పరీక్షలు
సిగ్నల్, టెలికాం వ్యవస్థలపై ప్రభావం
ఆటోమేటిక్ డోర్లు, భద్రతా వ్యవస్థల పనితీరు
CCTV, లైటింగ్, ఇంటీరియర్ సిస్టమ్ల స్టాటిక్ పరీక్షలు
షార్ట్ సర్క్యూట్ తదితర భద్రతా పరీక్షలు
ట్రయల్ సమయంలో ప్రతిరోజూ కనీసం రెండు రౌండ్ ట్రిప్పులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ పరీక్షలకు గరిష్ట వేగాన్ని గంటకు 145 కిలోమీటర్లుగా నిర్ణయించారు.
16 కోచ్లు.. 397 టన్నుల పేలోడ్ సామర్థ్యం
వందే భారత్ ఫ్రైట్ EMUలో మొత్తం 16 కోచ్లు ఉన్నాయి. ఉష్ణోగ్రత నియంత్రణ అవసరమైన ఆహారం, పానీయాలు వంటి వస్తువుల కోసం రెండు DTC రిఫ్రిజిరేటెడ్ కోచ్లు (రీఫర్ వ్యాన్లు) ఉన్నాయి. అదనంగా రెండు NDTC కోచ్లు, సాధారణ వస్తువులు, పార్శిళ్ల రవాణా కోసం 12 పార్శిల్ కోచ్లు ఉన్నాయి. ఈ రైలులో ఆధునిక వందే భారత్ ప్లాట్ఫామ్ కోచ్లను ఉపయోగించారు. అధిక వేగంతో ప్రయాణించే సమయంలో మెరుగైన స్థిరత్వం ఉండేలా వీటిని రూపొందించారు. రైలు యాక్సిల్ లోడ్ సామర్థ్యం 20.32 టన్నులు కాగా, మొత్తం పేలోడ్ సామర్థ్యం 397.02 టన్నులుగా ఉంది.
అధునాతన భద్రతా ఫీచర్లు
వందే భారత్ ఫ్రైట్ EMUలో సరుకు రవాణాను సురక్షితంగా నిర్వహించేందుకు అనేక ఆధునిక సాంకేతికతలను అందించారు. ఇందులో:
ఉష్ణోగ్రత నియంత్రిత రిఫ్రిజిరేటెడ్ పార్శిల్ సౌకర్యం
ఫోర్స్డ్ వెంటిలేషన్ సిస్టమ్
న్యూమాటిక్ రిట్రాక్టబుల్ రోలర్ ఫ్లోరింగ్
ప్రతి కోచ్లో నాలుగు వెడల్పాటి ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు
CCTV కెమెరాలు
LED లైటింగ్
ఫైర్ డిటెక్షన్ సిస్టమ్
కంటైనర్ లాకింగ్ వ్యవస్థ
అధునాతన బ్రేకింగ్, ప్రొపల్షన్ వ్యవస్థలు వంటి సదుపాయాలు ఉన్నాయి.
భద్రతలో భాగంగా గంటకు 5 కిలోమీటర్ల వేగాన్ని దాటిన తర్వాత అన్ని తలుపులు ఆటోమేటిక్గా లాక్ అయ్యేలా వ్యవస్థను రూపొందించారు. అలాగే అన్ని తలుపులు పూర్తిగా మూసుకున్న తర్వాతే రైలు ముందుకు కదిలేలా భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
కోటా డివిజన్నే ఎందుకు ఎంచుకున్నారు?
కొత్త రైళ్లు, ఆధునిక రైల్వే టెక్నాలజీలను పరీక్షించేందుకు కోటా డివిజన్ కీలక కేంద్రంగా మారుతోందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ డివిజన్లో పటిష్టమైన రైల్వే ట్రాక్ నెట్వర్క్, ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలు, సమర్థవంతమైన ఆపరేషనల్ మౌలిక సదుపాయాలు, హైస్పీడ్ టెస్టింగ్కు అనువైన మార్గాలు ఉన్నాయని అధికారులు వివరించారు. ఇప్పటికే పలు కొత్త రైళ్లు, సాంకేతికతలను ఈ ప్రాంతంలో విజయవంతంగా పరీక్షించినట్లు తెలిపారు. దేశంలోనే తొలి వందే భారత్ ఫ్రైట్ EMU ట్రయల్స్ను ఇక్కడ నిర్వహించడం ద్వారా కోటా డివిజన్ భారతీయ రైల్వేకు విశ్వసనీయమైన టెస్టింగ్ హబ్గా నిలుస్తోందని సౌరభ్ జైన్ పేర్కొన్నారు.
సరుకు రవాణాలో గేమ్చేంజర్గా మారుతుందా?
వందే భారత్ ఫ్రైట్ EMU విజయవంతమైతే భారతదేశంలో హైస్పీడ్ పార్శిల్ కారిడార్లు, ఈ-కామర్స్ లాజిస్టిక్స్, కోల్డ్-చైన్ రవాణా, సమయపాలనతో కూడిన సరుకు రవాణా సేవలకు కొత్త ఊపు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న ట్రయల్స్లో వేగం, భద్రత, బ్రేకింగ్, లోడ్ సామర్థ్యం, స్థిరత్వం వంటి అంశాలను పరీక్షిస్తున్నారు. అన్ని పరీక్షలు విజయవంతంగా పూర్తయి, అవసరమైన అనుమతులు లభించిన తర్వాత వాణిజ్య కార్యకలాపాలకు ఈ రైలును ఉపయోగించే అవకాశం ఉంది.
వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తే, సంప్రదాయ సరుకు రవాణా రైళ్లతో పోలిస్తే వేగంగా, సురక్షితంగా, సమయపాలనతో సరుకు రవాణా చేయడంలో వందే భారత్ ఫ్రైట్ EMU కీలక మార్పును తీసుకురావచ్చని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి.
A New Era of High-Speed Freight Begins!
The future of freight transportation in Indian Railways has taken a major leap forward as the country's first Vande Bharat platform-based Freight EMU begins its technical trials in West Central Railway's Kota Division.
On its very first… pic.twitter.com/fKVPU3I1Aa
— DRM KOTA (@drmkota) July 29, 2026

