Kedarnath: ఎంతో మంది హిందువులు జీవితంలో ఒక్కసారైన చూడాలని కలలు కనే మహా పుణ్యక్షేత్రం కేదార్నాథ్. ఈ పుణ్యక్షేత్రం ఉత్తరాఖండ్లో ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఆధ్యాత్మిక కోలాహలం మొదలైంది. హిమాలయాల్లోని పవిత్ర చార్ ధామ్ యాత్ర అక్షయ తృతీయ పర్వదినాన ప్రారంభం కాగా, భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. గంగోత్రి, యమునోత్రి ధామాలు ఇప్పటికే తెరుచుకోగా, రేపటి నుంచి (ఏప్రిల్ 22న) ప్రసిద్ధ కేదార్నాథ్ క్షేత్రం ద్వారాలు తెరుచుకోనున్నాయి. శివుని జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్కు ఆ పేరు ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న అసలు పురాణ గాథ ఏమిటి? ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: India Heatwave 2026: వేడికి కేరాఫ్ అడ్రస్ భారత్.. ప్రపంచంలోని టాప్ 20 హాటెస్ట్ ప్లేస్లలో 19 మనవే..
కేదార్నాథ్ అంటే పాండవుల కథేనా..
సాధారణంగా కేదార్నాథ్ అనగానే మనకు పాండవుల కథ గుర్తుకు వస్తుంది. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు శివుని దర్శనం కోసం ఇక్కడికి వచ్చారని, శివుడు వృషభ (ఎద్దు) రూపంలో వారికి కనిపించారని పురాణాలు చెబుతాయి. అయితే స్కంద పురాణంలో ఈ క్షేత్రం వెనుక ఉన్న మరో అద్భుతమైన కథ వివరించబడింది. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ముల్లోకాలను ఆక్రమించి, ఇంద్రుడిని, దేవతలను స్వర్గం నుంచి తరిమివేశాడు. నిరాశ్రయుడైన ఇంద్రుడు హిమాలయాల్లోని మందాకిని నది ఒడ్డున ఏకాంతంగా శివుని కోసం ఘోర తపస్సు చేశాడు.
“కే దారయామి?”
ఇంద్రుని భక్తికి మెచ్చిన శివుడు పరీక్షించదలచి ఒక దున్నపోతు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ రూపంలోనే శివుడు ఇంద్రుడిని “కే దారయామి?” అని అడిగాడు. సంస్కృతంలో దీనికి “ఎవరిని ముంచివేయాలి లేదా ఎవరిని నాశనం చేయాలి?” అని అర్థం. ఈ ప్రశ్నలోని ‘కే’, ‘దారయామి’ పదాల నుంచే ఈ క్షేత్రానికి ‘కేదార్’ అనే పేరు వచ్చిందని స్కంద పురాణంలోని ‘కేదార ఖండం’ వివరిస్తోంది. ముందుగా ఆశ్చర్యపోయిన ఇంద్రుడు, ఆ దున్నపోతు రూపంలో ఉన్నది సాక్షాత్తు పరమశివుడేనని గుర్తించి నమస్కరించాడు. శివుడు మళ్లీ అదే ప్రశ్న అడగగా.. ఇంద్రుడు ముల్లోకాలను వేధిస్తున్న హిరణ్యాక్షుడు, సుబాహువు, వక్తాకంధర్, త్రిశృంగుడు, లోహితక్షుడు అనే ఐదుగురు రాక్షసుల పేర్లు చెప్పాడు. వెంటనే శివుడు ఆ రాక్షసులను సంహరించి దేవతలకు రాజ్యాన్ని తిరిగి అప్పగించాడు.
శివుడు ఇచ్చిన వరం..
రాక్షస సంహారం తర్వాత ఇంద్రుని కోరిక మేరకు శివుడు అక్కడ ‘కేదార్ లింగం’గా వెలిశాడు. అక్కడ శివుడు సృష్టించిన కొలను (తీర్థం) విశిష్టత గురించి స్వయంగా ఇలా వివరించాడు.. ఈ కొలనులోని నీటిని రెండు చేతులతో మూడుసార్లు తాగితే మూడు తరాల పితృదేవతలకు మోక్షం లభిస్తుంది. ఎడమ చేతితో తాగితే తల్లి వైపు, కుడి చేతితో తాగితే తండ్రి వైపు వంశీయులకు సద్గతులు కలుగుతాయి. ఇక్కడ పిండదానం చేసి, అనంతరం గయలో కూడా పిండదానం చేసే భక్తులకు బ్రహ్మజ్ఞానంతో పాటు సంపూర్ణ మోక్షం సిద్ధిస్తుంది. ఏప్రిల్ 22న ఈ మహాక్షేత్ర ద్వారాలు తెరుచుకుంటున్న వేళ, భక్తజనం ‘హర హర మహాదేవ’ నామస్మరణతో హిమాలయాలకు పోటెత్తుతున్నారు.
READ ALSO: Canada Bill C-12: ఇండియన్స్ టార్గెట్గా కెనడా కొత్త రూల్స్? ఇక అంతే సంగతులు!
