Hyundai 26 New Cars: భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎన్నో కొత్త కార్లు.. సరికొత్త మోడల్స్తో ఆకట్టుకుంటున్నాయి.. ఒక కారు కొనే సరికి.. మరో కొత్త మోడల్ కార్ల ప్రియులను ఊరించేలా చేస్తోంది.. ఇప్పటికే భారత్లో మంచి మార్కెట్ కలిగిన హ్యుందాయ్.. ఇప్పుడు పెద్ద ప్లానే వేస్తోంది.. భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు హ్యుందాయ్ భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. 2030 నాటికి భారత మార్కెట్లో ఏకంగా 26 కొత్త మోడళ్లను పరిచయం చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో పూర్తిగా కొత్త కార్లతో పాటు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడళ్లకు అప్డేటెడ్ వెర్షన్లు కూడా ఉండనున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో హ్యుందాయ్ నాలుగో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా ఉంది. ఒకప్పుడు విక్రయాల్లో రెండో స్థానంలో ఉన్న ఈ కంపెనీకి ప్రస్తుతం టాటా మోటార్స్, మహీంద్రా వంటి సంస్థల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. మారుతి సుజుకి మాత్రం విస్తృతమైన పోర్ట్ఫోలియోతో మార్కెట్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దీంతో తన మార్కెట్ వాటాను పెంచుకునేందుకు హ్యుందాయ్ కొత్త రోడ్మ్యాప్ను రూపొందించింది.
చిన్న ఎలక్ట్రిక్ SUVపై హ్యుందాయ్ ఫోకస్
హ్యుందాయ్ కొత్త ప్లాన్లో అత్యంత ఆసక్తికరమైన మోడళ్లలో A-సెగ్మెంట్ ఎలక్ట్రిక్ SUV ఒకటి. ఈ కారు కంపెనీకి చెందిన అతి చిన్న SUVగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ వాహనం టెస్ట్ మోడళ్లు భారత రోడ్లపై పలుమార్లు కనిపించాయి. ఈ చిన్న ఎలక్ట్రిక్ SUVని భారత్లోనే తయారు చేసి మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఇది టాటా పంచ్ EV, టియాగో EV వంటి చిన్న ఎలక్ట్రిక్ కార్లకు పోటీగా నిలిచే అవకాశం ఉంది. అయితే వాహనం బ్యాటరీ, రేంజ్, మోటార్ వంటి పూర్తి స్పెసిఫికేషన్లను హ్యుందాయ్ ఇంకా వెల్లడించలేదు. కొత్త SUVలో లెవెల్-2 ADAS, నెక్స్ట్ జనరేషన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి అధునాతన ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ఈ చిన్న ఎలక్ట్రిక్ SUVని ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి తీసుకురావచ్చని అంచనాలు ఉన్నాయి.
మిడ్సైజ్ SUVతో మరో అడుగు
చిన్న EVతో పాటు హ్యుందాయ్ భారత మార్కెట్ కోసం కొత్త మిడ్సైజ్ SUVని కూడా అభివృద్ధి చేస్తోంది. గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉన్న బేయాన్ ఆధారంగా ఈ మోడల్ను రూపొందిస్తున్నట్లు సమాచారం. అయితే భారత వెర్షన్లో డిజైన్, ఫీచర్లు, ఇతర అంశాల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. ఈ కొత్త SUV ఇప్పటికే టెస్టింగ్ దశలో ఉన్నట్లు స్పై షాట్లు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మోడల్లో CNG ఆప్షన్పై హ్యుందాయ్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీ-ఫిటెడ్ CNGతో వచ్చే హ్యుందాయ్కు చెందిన తొలి 4 మీటర్ల కంటే పెద్ద కారు ఇదే కావచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి.
క్రెటా సెగ్మెంట్లో.. తక్కువ ధరతో?
కొత్త మిడ్సైజ్ SUV క్రెటా ఉన్న సెగ్మెంట్లోనే ప్రవేశించే అవకాశం ఉంది. అయితే క్రెటాతో పోలిస్తే తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే ఈ విభాగంలో ఉన్న మారుతి, టాటా, మహీంద్రా తదితర సంస్థల మోడళ్లకు హ్యుందాయ్ నుంచి మరింత పోటీ ఏర్పడే అవకాశం ఉంది.
తయారీ సామర్థ్యాన్ని పెంచనున్న హ్యుందాయ్
కొత్త మోడళ్లతో పాటు భారతదేశంలో తయారీ సామర్థ్యాన్ని కూడా హ్యుందాయ్ పెంచుకోనుంది. 2030 నాటికి దేశంలో తన వార్షిక తయారీ సామర్థ్యానికి మరో 3.2 లక్షల యూనిట్లను జోడించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం కంపెనీ భారత్లో ఏడాదికి సుమారు 11 లక్షల వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. అంతేకాదు.. హ్యుందాయ్ తన ప్రీమియం లగ్జరీ బ్రాండ్ జెనిసిస్ను కూడా భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ బ్రాండ్కు చెందిన తొలి కారు 2027లో భారత్లో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం హ్యుందాయ్ భారతదేశంలో వివిధ విభాగాల్లో సుమారు 15 మోడళ్లను విక్రయిస్తోంది. వీటిలో సాధారణ పెట్రోల్ మోడళ్లతో పాటు ఎన్-లైన్ వేరియంట్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, టాక్సీ వేరియంట్లు కూడా ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. చిన్న ఎలక్ట్రిక్ SUV, కొత్త మిడ్సైజ్ SUV, CNG మోడళ్లతో పాటు ప్రస్తుత కార్ల అప్డేట్లను కలిపి 2030 నాటికి 26 మోడళ్లను తీసుకురావాలనే హ్యుందాయ్ ప్రణాళిక భారత కార్ల మార్కెట్లో పోటీని మరింత పెంచే అవకాశం ఉంది.

